సంపూర్ణ గోలాయణం 68

 

ఏం చెయ్యాలో తోచక వర్ధనమ్మ వుట్టి లక్ష్మితో తన గోడు వెళ్ళబోసుకుంది. అది విన్న వుట్టిలక్ష్మికి ఒక ఐడియా వచ్చింది. భర్త రాగానే కాఫీ యిచ్చి తన ఐడియా వివరించింది.

“నీకేం మతిపోయిందా? అతనితో మనకున్న పరిచయం ఎంత? అ మాత్రాన చనువు తీసుకుని స్వవిషయాల్లో జోక్యం కలగచేసుకుంటే మర్యాదగా వుంటుందా?” అన్నాడు విశ్వనాధం.

"యిది మరీ బాగుంది. మనం ఏమైనా బ్యాంక్ దొంగతనం చెయ్యమంటున్నామా? జైలుకెళ్ళమంటున్నామా? పెళ్ళి చేసుకోమంటున్నాం. ఏదైనా అతనికి మనస్పూర్తిగా ఇష్టం అయితేనే! అతని వద్దంటే మనం బలవంతం చెయ్యంకదా! ఓ సారి మాట అడిగితే వచ్చే నష్టం ఏముంది?” అంది లక్ష్మి.

“సర్లే చూద్దాం! వీలుచూచుకుని అడుగుదాం" అనేశాడు విశ్వనాథం.

వెంటనే వంటింటిలో కెళ్ళివంట చేసేసింది, పుస్తకం చదువుకుంటూ కూర్చుంది.మామూలుగా ఏడున్నర అవుతుండగా రూమ్ కి వచ్చాడు శ్యామ్. ఆ రోజు అతని మనస్సు చిరాకుగా వుంది కారణం ఆవేళ'కూడా తను ట్యూషన్ చెప్పి వస్తుంటే జంక్షన్ లో మోహన్ కనిపించాడు. అతనివెంట ఆ అమ్మాయి కూడా వుంది. ఇటు చూస్తే మోహన్ నా అల్లుడు అని ఢంకా మీద దెబ్బకొట్టి చెపుతూ వుంటాడు సూర్యంగారు.

ఆ బస్టాప్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చిట్టిబాబుతో పందెం కాసి వున్నాడు మోహన్. ఇదంతా పెద్ద గందరగోళంగా అయోమయంగా అనిపిస్తోంది శ్యామ్ కి. కొంపతీసి మోహన్ ఏదైనా డబల్ గేమ్ లాంటిది ఆడడంలేదుకదా! ఇటు భారతినీ, అటు ఆ బస్టాప్ అమ్మాయినీ కూడా మోసం చేస్తున్నాడా? పైకి మరి యెంతోమంచివాడిలా కనిపిస్తాడు. ఏమో ఏం చెప్పగలం! ఆలోచిస్తున్నకొద్దీ బుర్ర వేడెక్కిపోసాగింది అతనికి.

లేచి చన్నీళ్ళ స్నానం చేసి బట్టలుమార్చుకుని రూమ్ తాళం పెట్టి హోటల్ కి వెళ్దామని బయటికి వచ్చాడు. వాకిట్లోనే వుంది వుట్టిలక్ష్మి "ఎక్కడికి వెళ్తున్నారు" అని అడిగింది.

చెప్పాడు. 'ఈ పూటకి మా ఇంట్లో భోం చెయ్యండి!” అంది.