Read more!

పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే ఆలయం!!

 

పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే ఆలయం!!

 

కార్తీకమాసంలో పితృకర్మలు ఎక్కువగా చేస్తారు. అలాంటి పితృదేవతలకు మోక్షాన్ని చేకూర్చే ఆలయం ఆ పరమశివుడి ద్వారా ఎంతో విచిత్రంగా పురుడుపోసుకుంది.

శివ పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు , బ్రహ్మ పంచముఖుడు, అంటే ఆయనకు అయిదు ముఖాలు ఉన్నాయి. అయితే నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కాని, ఆయన ఊర్ద్వముఖం పార్వతీదేవి అందాన్ని చూస్తూ ఉండిపోయింది, అది గ్రహించిన పరమ శివునికి ఆగ్రహం వచ్చింది, బ్రహ్మకు బుద్ది చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేసాడు, మహేశ్వరుడి చేతి దెబ్బ  సామాన్యమైనది కాదు. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కాని అది కింద పడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది, ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు, క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. 

బ్రహ్మ తప్పు చేశాడు, దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది అయితే అది సరాసరి బ్రహ్మ హత్యా పాతకంగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది. జగత్ప్రభువు, అంతటి తపశ్శాలికి ఆ పాపఫలం తప్పలేదు, దేవతలందరిని పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటొ సూచించమని పరమశివుడు అడిగాడు, అప్పుడు అందరూ "పరమేశ్వరా  నీకు తెలియని ధర్మం లేదు, ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి, శాసించగలిగినవాడివి, అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మాకు తోచింది చెపుతున్నాము, ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి, ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా నీ పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు, కొంత కాలానికి ఆ కపాలం నీ చేతి నుండి రాలిపోవచ్చు అని చెప్పారు దేవతలు.

పరమశివుడికి ఇది బాగానే ఉందని అనిపించింది భిక్షువుగా మారి మూడు లోకాలు తిరుగుతూ మళ్ళీ తన పెళ్లి జరిగిన చోటుకే చేరాడు, హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నాడు, అందుకు సంతోషించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు, అది తెలుసుకున్న నారాయణుడు శివుడివద్దకు వచ్చి "పరమశివా నీ అధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా!ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు బహుమతిగా ఇవ్వవా అని అడిగాడట, నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు, పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు, అప్పటినుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.

ఆ తరువాత శివుడు ఆయనదగ్గరకే భిక్షకు బయలుదెరాడు, ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు,"పరమ శివుడే నాదగ్గరికి భిక్షకి వస్తున్నాడు, నిజానికి ఇది ఆయన ఇల్లే, తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట, ఈ అద్భుత సన్నివేశాన్ని జగత్విదితం చేయాలి, ఇది వాస్తవానికి శివక్షేత్రం, ఇందులో నేను( విష్ణువు) ఉన్నాను, ఇక్కడికి శివుడు బ్రహ్మకపాలంను పట్టుకుని వస్తున్నాడు, చిరకాల శివ హస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి.  ఇప్పుడది పరమపవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి దానికితోడు విష్ణు శక్తి, శివ శక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని" భావిస్తు విష్ణువు శివుడికి ఎదురువెళ్లి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు, అంతే ఆ కపాలం కాస్తా ఊడి క్రిందపడిపోయి శిలామయ (రాతి) శివలింగరూపంగా మారిపోయింది, అప్పటినుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగరూపధారి అయిన బ్రహ్మకపాలం మహా క్షేత్రమైంది, తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గం అయ్యింది.

◆ వెంకటేష్ పువ్వాడ