Read more!

మహాసప్తమి నాడు కాళరాత్రి దేవిని ఇలా పూజిస్తే పీడలన్నీ తొలగుతాయి!

 

మహాసప్తమి నాడు కాళరాత్రి దేవిని ఇలా పూజిస్తే పీడలన్నీ తొలగుతాయి!

దేవి నవరాత్రులలో ఏడవరోజును మాహాసప్తమి అని కూడా అంటారు. ఈరోజున అమ్మవారు కాళరాత్రి రూపంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మ దుర్మార్గులను నాశనం చేస్తుంది కాబట్టి కాళరాత్రి అని అంటారట. ఈ అమ్మను పూజించేవారికి శుభాలను చేకూరుస్తుంది కాబట్టి అమ్మవారిని శుభంకరి అని కూడా అంటారు.  ఈ అమ్మకు మూడు కన్నులు ఉంటాయి. ఈ అమ్మను పూజిస్తే భయం తొలగిపోతుంది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు ఈ అమ్మ ఆరాధన వల్ల దాన్ని నయం చేసుకోగలుగుతారు. ప్రేతాత్మల బాధ, అకాల మరణం, రోగాలు, దుఃఖం, మానసిక సమస్యలు మొదలైనవి అన్నీ పరిష్కారం అవుతాయి. మహాసప్తమి రోజు ఈ అమ్మను ఎలా పూజించాలో, ఈ అమ్మ ప్రాముఖ్యత ఏమిటో పూర్తీగా  తెలుసుకుంటే..


శుంభ, నిశుంభ, రక్తబీజులను సంహరించడానికి దుర్గమాత కాళరాత్రి అవతారం ఎత్తవలసి వచ్చిందని చెబుతారు. కాళరాత్రి దేవి శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అమ్మవారి  ఊపిరి నుండి అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. మెడలో దీపాలలా వెలుగుతున్న కపాలాల  దండ ఉంటుంది. ఈ అమ్మ  జుట్టు పొడవుగా చెల్లాచెదురుగా ఉంటుంది. కాళరాత్రి దేవి  మూడు కళ్ళు విశ్వమంత  పెద్దగా,  గుండ్రంగా ఉంటాయని చెబుతారు. కళ్ళ నుండి  మెరుపు లాంటి  కిరణాలు వెలువడుతూ ఉంటాయి. తల్లికి నాలుగు చేతులు ఉంటాయి. అందులో ఒక చేతిలో ఖడ్గం,  రెండవ చేతి ఇనుప ఆయుధం, మూడవ చెయ్యి అభయ ముద్ర,  నాల్గవ చేయి వరముద్రలో ఉంటుంది. అమ్మ  ఈ భయాన్ని కలిగించే రూపం పాపులను నాశనం చేయడానికి మాత్రమే.

నవరాత్రులలో సప్తమి నాటి రాత్రిని కార్యసిద్ధి కలిగించే రాత్రి అని కూడా అంటారు. ఈ రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల రోగాలు నశించి శత్రువులపై విజయం లభిస్తుంది.  గ్రహసంబంధమైన ఆటంకాలు,  భయాలను తొలగించే అమ్మవారిని ఈ రోజున తప్పక పూజించాలి.  

అమ్మవారి పూజ ఎలాగంటే..

దేవీ నవరాత్రులలో ఏడవ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఉదయం స్నానం చేసి,  అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అమ్మవారికి  ఎరుపు రంగు పూలను అలంకరించాలి.  ఐదు రకాల పండ్లు, ధూపం,గంధం,  పువ్వులు,  బెల్లం నైవేద్యం మొదలైనవి సమర్పించాలి. ఈ రోజున బెల్లంకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి బెల్లం తప్పకుండా  లేదా దానితో చేసిన వంటకాలను నివేదించాలి. పూజ ముగిసిన తరువాత, అమ్మవారి మంత్రాలను పఠించి హారతి  ఇవ్వాలి.  దుర్గా చాలీసా,  దుర్గా సప్తశతి పఠిస్తే మంచిది.  

అమ్మవారి మంత్రం..
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛై ఓం కాళరాత్రి దేవి ఓం:

అమ్మవారి బీజమంత్రం..

ఓం కాళరాత్య్రై నమః

  *నిశ్శబ్ద.