Read more!

గురువును ఎలా ఎంపికచేసుకోవాలి??

 

గురువును ఎలా ఎంపికచేసుకోవాలి??


జ్ఞానము సంపాదించడానికి మార్గమేమిటి అనే విషయానికి భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెబుతాడు.   ముందు తత్వవేత్త అయిన గురువును వెతుక్కోవాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయాలి. ఆయనకు సేవలు చేస్తూ సమయం కొరకు ఆయన పక్కన వేచి ఉండాలి. గురువు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆయనను జ్ఞానము గురించి ప్రశ్నించాలి. అప్పుడు గురువు ప్రసన్నుడై జ్ఞానోప దేశం చేస్తాడు. గురువు ఉపదేశములను శ్రద్ధతో వినాలి. విన్నది భక్తితో ఆచరించాలి. ఈ విధంగా జ్ఞానమును సంపాదించాలి..

ఇక్కడ కృష్ణుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ ఆత్మజ్ఞానము అనేది ఎవరికి వాళ్లు తెలుసుకునేది కాదు. కేవలం గురువు ద్వారానే పొందదగినది. ఎందుకంటే, మనము ఎంత పండితులు అయినా, సంస్కృతము బాగా అధ్యయనం చేసినా, శాస్త్రములలోనూ, వేదములలోనూ, ఉపనిషత్తులలోనూ ఉండే విషయములను సరిగా అర్థం చేసుకోలేము. తప్పుగా అర్థంచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ద్వారానే మనము శాస్త్రములను సరిగా అర్థంచేసుకునే అవకాశం ఉంటుంది.

ఆత్మజ్ఞానం గురించి అంటే తనను గురించి తాను తెలుసుకోడానికి ముందు, శాస్త్రము గురించిన అవగాహన కావాలి. శాస్త్రము అంటే వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవి. శాస్త్రముల సాయం లేనిదే మనం మన గురించి తెలుసుకోలేము. మన ముఖం మనం చూసుకోవాలంటే మనకు అద్దం కావాలి. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు శాస్త్రప్రమాణం అత్యవసరము, కేవలము శాస్త్రము ఉండి ప్రయోజనము లేదు. ఆ శాస్త్రాన్ని మనకు అర్ధం అయేటట్టు చెప్పే గురువు ఉండాలి. మందుల షాపులో మందులు ఉన్నాయి. ఏ జబ్బుకు ఏ మందు వేసుకోవాలో, ఏ మోతాదులో వేసుకోవాలో చెప్పడానికి డాక్టరు కావాలి. అలాగే శాస్త్రములలో ఉన్న విషయాలను మనకు విడమరచి అర్థం అయేటట్టు చెప్పడానికి గురువు కావాలి. గురువు అంటే అంధకారమునుండి వెలుగులోకి నడిపించేవాడు. అజ్ఞానము అనే చీకటి లోనుండి జ్ఞానము అనే వెలుగులోకి నడిపించేవాడు అని అర్ధము.

ఆ గురువులు ఎలా ఉండాలి అంటే గురువుల యొక్క అర్హతల గురించి కూడా  చెప్పాడు కృష్ణ పరమాత్మ. వారు జ్ఞానులు అయి ఉండాలి. అంటే జ్ఞానం సంపాదించి ఉండాలి. జ్ఞానం సంపాదించాలంటే వారు వంశపరంపరగా జ్ఞానసముపార్జన చేసిన వారు అయి ఉండాలి. గురు సంప్రదాయం కలవారుగా ఉండాలి. ఇంకా వారు తత్వదర్శనులు అయి ఉండాలి. అంటే పరమాత్మ తత్వమును బాగా తెలుసుకొని ఉండాలి. తత్వదర్శికాకుండా, కేవలం తత్త్వదర్శి అని పేరుపెట్టుకొని, ఉపన్యాసములు ఇచ్చేవారు. వేదాలను వల్లించేవారు, వేదాంతము చెప్పేవారు గురువులు కాదు. తత్వదర్శనుడు అయి ఉండి, తాను తెలుసుకున్నదానిని దర్శించిన దానిని తన శిష్యులకు అర్ధం అయేటట్టు బోధించే వాడు మాత్రమే జ్ఞానబోధకు అర్హులు. వారినే బోధగురువులు అని అంటారు.

ఇలా సరైన గురువును ఎంపిక చేసుకోవాలి అని చెబుతాడు కృష్ణుడు. సరైన గురువు లేకపోతే ఆ శిష్యుడి మార్గం సరైన విధంగా ఉండదు. అతడి మార్గం మొత్తం మారిపోతుంది. అలాగే కాషాయ బట్టలు వేసుకుని, రుద్రాక్ష మాలలు వేసుకుని, ఏ గుడిలోనో లేక ఇతర ప్రాంతాలలోనో ప్రజలను గుంపేసుకుని అక్కడా ఇక్కడా విన్నవి, చదివినవి చెబితే అతడు గురువు అయిపోడు. సరిగ్గా ఈ విషయాన్నే ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాలి. కానీ పిచ్చివాడి వెంటపడి వాడి బండారం బయటపడ్డాక గురువులను అందరినీ తిట్టడం ఎంతవరకు సమంజసం?? అని విషయం తెలుసుకోవాలి. 

◆వెంకటేష్ పువ్వాడ.