Read more!

బాలాత్రిపుర సుందరి దేవి మొదటి రోజు (balatripurasundari devi day -1)

 

"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"


శరన్నవరాత్రి ఉత్సవాలలో  మొదటి రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.

                                                          నైవేద్యం - పొంగలి
కావలసిన పదార్ధాలు

బియ్యం - ఒక గ్లాస్
పెసరపప్పు - ఒకటిన్నర గ్లాస్
పచ్చిమిర్చి - ఒకటి
మిరియాలు - పదిహేను
సెనగపప్పు - రెండు టీ స్పూన్స్
మినపప్పు - ఒక టీ స్పూన్
జీల కర్ర- అర టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
కరివేపాకు - పది ఆకులు
అల్లం (తురుము) ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయ - ఒకటి
జీడిపప్పు - ఏభై గ్రాములు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
నూనె - ఒక టేబుల్ స్పూన్
నీళ్లు - మూడు గ్లాసులు
ఉప్పు తగినంత

తయారు చేయు విధానం
కుక్కర్లో నూనె వేసి కాగనిచ్చి నగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం తురుము, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అందులో కడిగిన బియ్యం, పెసరపప్పు వేసి కొద్దిగా అటు ఇటు వేయించి ఉప్పు వేసి, నీళ్లు పోసి మూతపెట్టేయాయాలి. మూడు విజిల్స్ రానిచ్చి కుకర్ దించితే సరిపోతుంది.