ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం

 

ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం

 

 

 


గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ  ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై  కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 -620  ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలు గా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతానుయాయులుగా అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెపుతోంది .   

 

 

 


   
నిర్మాణ సోయగం :- ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా  వివిథా కృతులలో మలచిన ఆనాటి  శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి జోహార్లు ప్రతి యాత్రీక భక్తుడు వందనాలు సమర్పించాల్సిందే.  శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల  ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతిఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోతున్నారు.                                       
మొదటి అంతస్తు :- క్రింద  భాగం  మొదటి అంతస్తులో  గుప్తుల,చాళుక్యుల  కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ద సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం  ప్రారంభమైంది.    వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి   మార్గము , విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది.               

 

 

 



రెండవఅంతస్తు :- రెండవ అంతస్తు లోనికి   మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా  చెపుతున్నారుగాని  ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న  వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతి గా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి.   

 

 

మూడవ అంతస్తు లోకి మెట్లమార్గం

                       

                               
                
చారిత్రక నేపథ్యం :- ఈ గుహాలయాలు  నాలుగు అంతస్తులు  కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా  విష్ణు బంధమైన గుహాలయము. సాథారణం గా బౌద్ధ ,జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాథికారిగా పనిచేసిన మాథవరెడ్డి చేత ఈ అనంత పద్మనాభుని గుహాలయము నిర్మింపజేసినట్లుగా చెప్పబడుతోంది.

 

 

 



రెండవ అంతస్థుకు వెళ్ళే మెట్లమార్గం ప్రక్కనే ఉన్న కొండపై శాసనం ఒకటి శిథిలమై కన్పిస్తోంది. ఇక్కడ నుండి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి  కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించేవారని జనశృతి. ఈ విషయాన్ని "మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి'' అనే  వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. రాజులు యుధ్ధసమయాల్లో శతృరాజులకు తెలియకుండా సైన్యాన్ని ఈ సొరంగమార్గం ద్వారా తరలించేవారని ఒకరు వ్రాశారు. కాని ప్రస్తుత కాలంలో దాపురించే వివిథ ప్రమాదాలను నివారించడానికిగాను అథికారులు ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు.     

 

 

శాసనం

    
                       
    
మూడవ  అంతస్తు :- మూడవ అంతస్థులోనికి వెళ్లడానికి గుహను అందగా తొలిచి మెట్లమార్గాన్ని నిర్మించారు. మెట్లను మలిచిన విధానంలోనే ఈ అంతస్థు ప్రత్యేకతను  ప్రకటించారు శిల్పులు. ఈ గుహాలయంలోకి ప్రవేశించడమే ఓ వింత అనుభూతిని కల్గిస్తుంది. రెండు వరుసల స్థంభాల మథ్యలో విశాలమైన మండపము విశ్రాంతిమండపంగా  భక్తుల్ని ఆహ్వానిస్తుంది. ఆ స్థంభాలపై దశావ తారాలు, వివిథ దేవతామూర్తుల శిల్పాలు  కొలువు తీరి చూడగానే పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం.              

 

 

                   
                            

మహా గణపతి

                          
లంబోదరుని సహస్ర రూపాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను  శిల్పం లో దర్శింపజేయడం  నాన్యతో దర్శనీయం.    

 

 

                            
  
ఉగ్రనరసింహుడు :- ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితో పాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి.     
  

శ్రీ లక్ష్మీదేవితో   ఆదివరాహస్వామి


స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు.
                                                                

 

కుడ్యశిల్పం

         

 

 

 

మరొకస్థంభం మీద కన్పించే శిల్పం ఉగ్రనరసింహుడు. ఇందాక చూచిన రెండు శిల్పాల కంటే పూర్తి వైవిథ్యం కల్గిన మనోహర శిల్పం ఇది. హిరణ్యకశిపుని సంహరిస్తున్న నరసింహునిలో మహోగ్ర రూపాన్ని చూస్తాం. కాని ఈ నారసింహుని వదనంలో ఒక మహోన్నతమైన ఆనందాన్ని ఎంత స్పష్ఠంగా ఆ శిల్పి చెక్కాడో మనం గమనించ వచ్చు. ఉగ్ర నరసింహుని ముఖంలో ఆనందాన్ని చూపించడానికి కారణం ఆ శిల్పి గొప్ప  దైవభక్తుడు, ఉపాసనాపరుడై ఉండాలి. హిరణ్యకశిపుని సంహరించడం వలన తన ప్రియభక్తునికి విమోచనం కలిగించాననే ఆనందం ఆ పరమాత్మకు కల్గిందనేది ఆ శిల్పి భావన. అందుకే ఆ ఉగ్రమూర్తి ముఖంలోని ఆనందాన్ని  అంత స్పష్టంగా  ప్రదర్శింపచేశాడో.                 
  

 

 

ఆ ప్రక్కనే కన్పించేది వామనావతార ఘట్టం

వామనావతార ఘట్టము            

 

                   

 

                                             
మరొకస్థంభం మీద రూపుదిద్దుకన్నది హనుమత్సందేశం

హనుమత్సందేశ ఘట్టం   

 

 

         

ఆ   కొండ లోపలి గూడులో అంజనీసుతుడు.

 

 

 

                                  

 


               
శ్రీ అనంతపద్మనాభస్వామి :- మూడవ అంతస్తు చివరి మందిరంలో కొలువుతీరి ఉన్నాడు శ్రీ అనంతపద్మనాభుడు. చూడటానికి రెండు కళ్లు చాలవనేది మనలో మాట. నల్లని గ్రానైటు లో ఏకశిలా నిర్మితమై. పద్మపత్ర విశాలాక్షుడై, అనంతశయనుడై, పద్మనాభుడై, గగనచరులైన దేవతలందరూ ఆనందంనాట్యం చేస్తుంటే, జయ-విజయులు పాదాల చెంత  కర్తవ్య పాలనలో ఉండగా, మహర్షులు తపోమగ్నులై యుండగా, ఆకాశంలో గరుడుడు నాట్యం చేస్తుంటే, దర్శనమిస్తున్నాడు శ్రీ అనంతపద్మనాభస్వామి. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించవలసిందే కాని వర్ణింపవలవికాదు. ప్రతిరోజు పూజారి గారు ఏడున్నరకు వచ్చి తొమ్మిదింటి దాక ఉంటారట. శనివారంనాడు దూరప్రాంతాల నుండి కూడ భక్తులు వస్తారు. భక్తులు చల్లే పసుపుకుంకాలతో ''నల్లనయ్య'' రూపం ఎర్రగా మారిపోయి, ఎర్ర గ్రానైటుతో చెక్కిన శిల్పంలా కన్పిస్తోంది.

 

 

                     
            

నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మ

                                   

 

 
శ్రీ పద్మనాభుని మందిరంలోని సమస్త దృశ్యాన్ని ఒకేసారి మనం చూడగలిగితే, స్వామితో పాటు పద్మోద్భవుడైన  బ్రహ్మ, ఆనందంలో సురేశుని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో ఉన్న ఋషులు, ఆయుథ పాణులైన అంగరక్షకులు, గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడు ఇదీ దృశ్యం. ఈ   అనంత శయనుణ్ణి చూడగానే  ఈ శ్లోకం  స్భురణ కొస్తుంది :
''శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగనసదృశం, మేఘవర్ణం, శుభాంగం,
లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం''
ఈ శ్లోకమే ఈ శిల్పికి ప్రేరకమై, శ్రీ అనంతపద్మనాభుని రూపాన్ని భువన మోహనంగా మన ముందు రూపు కట్టించింది.                                  

 

 

 

                            
ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు 
                     

 


నాగబంథం :- మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.

 

 


 


నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు  విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు?        

 

                  


వేదపురుషులా?

 

             
ఈ గుహాలయాల్లో నాల్గవ అంతస్తు కూడ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

 

 

 


రవాణాసౌకర్యాలు :- విజయవాడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు.  మంచినీళ్లు తీసుకువెళ్లడం మాత్రం మరచిపోవద్దు.