ముచ్చటగా మూడోసారి బాలయ్యతో...
on Jul 6, 2017
చకచకా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య. ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. నేటి తరం హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పైసా వసూల్’చిత్రం చివరి పాట షూటింగ్ జరుపుకుంటోంది. అన్నపూర్ణా స్టూడియోలో వేసిన పబ్ సెట్లో పాటను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇదిలా వుంటే... ఆయన 102 చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేస్తున్నారు బాలయ్య. ఆగస్టు 2న హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు ఆ చిత్ర నిర్మాత సి.కల్యాణ్. కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార ఎంపికయ్యారు. బాలయ్యతో నయన జోడీ కట్టడం ఇది మూడో సారి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు మంచి జనాదరణ పొందాయి. మరి ఈ చిత్రంతో ఈ జంట హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.