తెల్లవారికి చెప్పమంది బాయ్ బాయ్....

తెల్లవారికి చెప్పమంది బాయ్ బాయ్.... ఆమెవరో కాదండీ ఝాన్సీ లక్ష్మీబాయి.... అంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతీ భారతీయుడు ఆమెను తలుచుకున్నారు. అంతటి వీర నారి ఆమె. బ్రిటీష్ వారిపై భారతీయుల పోరాట స్ఫూర్తికి...అక్షరాల ఆమె మూర్తి... వారణాశిలో మోరాపంత్ ధాంబే గారికి జన్మించారు. మణికర్ణిక అనేది ఆమె చిన్ననాటి పేరట. అప్పట్లో చిన్న మరాఠా సంస్ధానమైన ఝాన్సీ పరిపాలకుడు రాజా గంగాధరరావుకు ఆమెనిచ్చి వివాహం చేశారు. పెళ్ళయిన తర్వాత ఆమె లక్ష్మీబాయిగా పేరుపొందారు. వారసులెవ్వరూ లేకుండానే గంగాధరరావు మరణించారట. చనిపోవటానికి ముందు దామోదర్ ను ఆయన దత్తత తీసుకున్నారు. 

అప్పట్లో లార్డ్ డల్ హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉండేవారు. దామోదర్ ను చట్టబద్ధమైన వారసుడిగా, లక్ష్మీబాయిని రాజప్రతినిధిగా అంగీకరించడానికి డల్ హౌస్ నిరాకరించారు. దాంతో గొడవ మొదలైంది. ప్రతిఘటనలు, నిరసనలు ఎదురైనప్పటికీ ఝాన్సీ లక్ష్మీభాయ్ కి అయిదువేల రూపాలయ చిన్నమొత్తాన్ని భరణంగా ఇవ్వసాగారు. అయితే ఈ అగౌరవాన్ని, పరాయివారికి లోబడి ఉండడాన్ని రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ జీర్ణించుకోలేకపోయారు. సంస్ధానాన్ని వదిలిపెట్టకూడదనుకున్నారు. 

అంతే ఆమె వారి మీద 1857 మే నెలలో తిరుగుబాటు చేశారు. ఝాన్సీ సంస్ధానమంతా రాణీ లక్ష్మీబాయిదే అధికారమని ప్రకటించారు. బ్రిటిష్ సేన దండయాత్రకుదిగితే  వారిని ఎదుర్కొని... గ్వాలియర్ కోటను లక్ష్మీబాయి తన అధీనంలోకి తీసుకుంది. అది చూసి గ్వాలియర్ మహారాజు కోట వదిలి పరిగెత్తాడు. ఆయన బలగాల్లో అత్యధికశాతం లక్ష్మీబాయి పక్షం వచ్చేసాయి. దెబ్బతిన్న బ్రిటిష్ వారు గ్వాలియర్ కోట మీద ఒక్కసారి దాడి చేశారు. లక్ష్మీ బాయ్ తీవ్రపోరాటం చేసినప్పటికీ ఆపోరులో మరణించింది. ఆ విధంగా తన ఇంటికి సుదూరప్రాంతంలో రాని అశువులు బాసింది. కానీ బ్రిటిష్ వారి మీద ఝాన్సీ లక్ష్మీ భాయి చూపిన ధైర్యసాహసాలు బలపరాక్రమాలు, సామర్ధ్యం భారతీయులెవ్వరూ ఎప్పటికీ మరిచిపోరు. ఆమె చిరస్మరణీయురాలు.