బాబా పిలుపుతోనే ఇక్కడికి వచ్చా: చంద్రబాబు
posted on Nov 23, 2018 2:38PM

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి వెళ్లారు. ప్రశాంతినిలయంలో నిర్వహిస్తున్న సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బాబాతో తనకున్న అనుబంధం అపురూమైనదని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి బాబా అని కొనియాడారు. బాబా అందించిన మహా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి అని, ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికీ మనశ్శాంతితో పాటు, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు చెప్పారు. బాబా మనందరి మధ్య లేకపోయినా మనందరిలో ఆయన జీవించి ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఉన్నత స్థాయికి చేరాలనుకునే ప్రతి వ్యక్తీ బాబా సూక్తులను, మార్గాలను పాటిస్తే తప్పకుండా గమ్యం చేరుకుంటారని చెప్పారు. సత్యసాయి అనుగ్రహంతోనే పుట్టపర్తికి రాగలమని, బాబా పిలుపుతోనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ మహోన్నతమైన అనుభూతిని పొందుతానని, ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలనిపించదని, తనకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలనిపిస్తుందని చంద్రబాబు చెప్పారు.