ఒకే జిల్లాలో పవన్, లోకేష్ పోటీ.. స్థానాలపై క్లారిటీ
posted on Mar 12, 2019 2:34PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వీరు ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. పవన్ ఆ స్థానం నుండి పోటీ చేస్తారు, లోకేష్ ఈ స్థానం నుండి పోటీ చేస్తారని రోజుకో వార్త చక్కర్లు కొట్టింది. అంతెందుకు వీరిద్దరూ భీమిలి నుంచే పోటీ చేస్తున్నారనే వార్త కూడా వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య ప్రత్యక్ష పోటీ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరూ వేరు వేరు స్థానాల నుండి బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ పోటీ చేసే స్థానాలు కూడా ఖరారు అయినట్లు సమాచారం.
విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక లోకేష్ విషయానికొస్తే విశాఖ నగరంలోని పూర్తి నగర ప్రాంతమైన విశాఖ-ఉత్తరం నియోజకవర్గం నుండి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించిన చంద్రబాబు.. లోకేష్ కి విశాఖ ఉత్తరం టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. మొత్తానికి పవన్, లోకేష్ ఒకే జిల్లాలో వేరు వేరు నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్నారన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.