ఈ పాపం కాంగ్రెస్దే
posted on Jul 31, 2013 8:31PM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా విభజన సెగలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణతో పాటు బలమైన ఉద్యమంగా కొనసాగుతున్న గుర్ఖాల్యాండ్ పోరాటం తెలంగాణ ప్రకటనతో మరోసారి ఉవ్వెత్తున్న ఎగసి పడింది. తెలంగాణ ప్రకటన రాబోతుంది అన్న నేపధ్యంలోనే 72 గంటల బంద్కు పిలుపునిచ్చిన అక్కడి ప్రజలు తెలంగాణ ప్రకటనతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు.
దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. దేశాన్ని ముక్కలుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని మండిపడ్డారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించటం వల్లే తమ రాష్ట్రంలో ఇలా అనిశ్చితి నెలకొంది అని మండిపడ్డారు.
ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా పశ్చిమబెంగాల్ విడిపోనివ్వనన్న మమత కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా విమర్శించారు. గుర్ఖాల్యాండ్ పశ్చిమ బెంగాల్లో అంతర్భాగమేనని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని ప్రకటించారు.