కోల్ కతా అగ్నిప్రమాదం లో 20 మృతి
posted on Feb 28, 2013 9:21AM
కోల్కతాలోని సూర్య సేన్ మార్కెట్లో ఓ గోదాంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కవగా దుకాణాల యజమానులు, పనిచేసేవారు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు. సుమారు 20 అగ్నిమాపక యంత్రాలతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు.
అగ్నిప్రమాద స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంభాలకు రెండు లక్షల చొప్పున, గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, మార్కెట్లో కాయకష్టం చేసి.. అలసిపోయి.. నిద్ర పోయిన కూలీలను అగ్నిజ్వాలలు బలిగొన్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, కాగితాలు, వస్త్రాలకు నిప్పంటుకొని పొగలు సుడులు తిరగడంతో ఊపిరాడక.. తప్పించుకునే దారి కానరాక అక్కడ నిద్రించిన వారిలో ఎక్కువ మంది సజీవదహనమయ్యారు.