నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుండా నెయిల్ పెయింట్ తొలగించుకోవచ్చు..  అమ్మాయిల అందానికి బోలెడు అలంకారాలు. వీటిలో దుస్తులు, నగలు, పాదరక్షల దగ్గర నుండి దుస్తులకు వేసుకుని పిన్నులు, జడలకు వేసుకుని క్లిప్పుల వరకు బోలెడు ఉంటాయి. ఇక చేతులు అందంగా కనిపించడం కోసం, బయటకు పార్టీలకు వెళ్లినప్పుడు అట్రాక్షన్ గా ఉండాలని గోళ్ళకు  నెయిల్ పాలిష్ వేస్తుంటారు. ఈ రోజుల్లో బట్టలకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకునే ట్రెండ్ ఎక్కువైంది. నెయిల్ పాలిష్ వేయడం చాలా సులభం, కానీ దానిని తొలగించేటప్పుడు చాలా కష్టం. డ్రస్ మార్చిన ప్రతిసారి నెయిల్ పాలిష్ మార్చడం చాలామందికి సమస్యగా ఉంటుంది. కారణం నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా నెయిల్ పాలిష్ అంత ఖరీదైనదే.. భీభత్సంగా వాడితే అది మాత్రం అయిపోకుండా ఉంటుందా ఏంటి? అయితే  గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కింది ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలు.. టూత్‌పేస్ట్.. పళ్లు తోమడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్  గోళ్లకున్న పాత నెయిల్ పాలిష్ తొలగించడంలో  కూడా ఉపయోగించవచ్చు.  ఇందుకోసం గోళ్లపై టూత్‌పేస్ట్‌ను రాసి లైట్ గా  బ్రష్ సహాయంతో గోళ్లను తేలికగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ తొలగిపోతుంది. టూత్‌పేస్ట్,  బేకింగ్ సోడా.. టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని  గోళ్లపై రాస్తే పాత నెయిల్ పాలిష్ చాలా సులువుగా  తొలగిపోతుంది. వేడి నీరు..  వేడి నీటి సహాయంతో నెయిల్ పాలిష్‌ను తొలగించుకోవచ్చు. ఇందుకోసం కొంచెం నీటిని ఒక పాత్రలో వేడి చేయాలి.  తరువాత వేళ్లను  గోరు వెచ్చని నీటిలో 25-30 నిమిషాలు ఉంచాలి. ఇది ఓపికతో కూడుకున్నది అయినా గతిలేని పరిస్థితిలో కచ్చితమైన ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది.  ఇలా ఉంచితే క్రమంగా నెయిల్ పెయింట్ దానంతట అదే రాలిపోతుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉపయోగించడం  ద్వారా కూడా గోళ్ళకు ఉన్న  నెయిల్ పాలిష్‌ను వదిలించుకోవచ్చు. నిమ్మరసం కలిపిన నీళ్లలో గోళ్ళను ముంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచితే  నెయిల్ పాలిష్ పోవడమే కాదు గోర్లు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. వెనిగర్  నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి వెనిగర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం వెనిగర్‌లో నిమ్మరసం మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే  నెయిల్ పాలిష్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.                                                           *నిశ్శబ్ద.

కేవలం 10రూపాయలకే ముఖం చందమామలా మెరిసిపోతుంది! అమ్మాయిలు ముఖ చర్మం మెరిసిపోవడానికి ఎన్ని మార్కెట్ ఉత్పత్తులు వినియోగిస్తారో లెక్కపెట్టడం కష్టం. కానీ విచారించాల్సిన విషయం ఏమిటంటే..ఎన్ని వాడినా  చర్మం అలాగే కనిపిస్తుంది. టీనేజ్ అమ్మాయిల్లా చర్మం మిల్కీగా, ముడతలు లేకుండా, మెరుస్తూ ఉండాలనేదే అమ్మాయిల ఆరాటం అంతా. అయితే దీనికోసం వందలు, వేలు ఖర్చు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ కొని వాడక్కర్లేదు. కేవలం 10రూపాయల ఖర్చుతో అద్భుతం చేయవచ్చు.  ఈ టిప్ ఫాలో అయితే ముఖం మీద ముడుతలు, మచ్చలు, మొటిమల తాలూకు గుంతలు అన్నీ మాయమైపోతాయి. ఇంతకూ అంత మ్యాజిక్ చేసే టిప్ ఏంటి? దీన్నెలా ఉపోయోగించాలి తెలుసుకుంటే.. ఇప్పటికాలంలో బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే అమ్మాయిలందరికీ విటమిన్-ఇ గురించి తెలిసే ఉంటుంది. జుట్టు పెరుగుదల కోసం క్యారియర్ ఆయిల్ తో కలిపి విటమిన్-ఇ ఆయిల్ ను అప్లై చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే కొబ్బరి నూనెలో విటమిన్-ఇ ఆయిల్ కలిపి రాయడం వల్ల మ్యాజిక్ జరుగుతుంది. రెండు స్పూన్ల  కొబ్బరినూనెలో రెండు విటమిన్-ఇ టాబ్లెట్ల ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని చిన్న కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. కావాలంటే ఎక్కువ మోతాదులో తయారుచేసి నిల్వచేసుకోవచ్చు. మొదటగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముఖం మీద తడిలేకుండా తుడుచుకుని తయారుచేసుకున్న  ఆయిల్ ను నాలుగైదు చుక్కలు అరచేతిలో వేసుకుని బాగా రబ్ చేసి ముఖమంతా పట్టించుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని ఓ అయిదు నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. దీన్ని ఓ 20నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ ఆయిల్ వల్ల మరింత మంచి ఫలితాలు కావాలంటే దీన్ని రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది. ఇలా చేస్తే ముఖ  చర్మంలోకి బాగా ఇంకిపోయి ముఖం మీద ముడుతలు తొలగించడంలో మరింత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇలా ప్రతిరోజూ ఈ నూనెను అప్లై చేస్తుంటే ముఖ చర్మం చాలా తొందరగా యవ్వనంగా మారుతుంది. ఈ నూనె ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉదయం సమయంలో అప్లై చేయకపోవడం మంచిది. విటమిన్ ఇ లో  అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కారణంగా ఇది   రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.  చాలామందికి ముఖంపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కూడా. ఇలాంటి మచ్చలు హార్మోన్ల అసమతుల్యత   లేదా ఎండకు  ఎక్కువగా చర్మం ఎఫెక్ట్ కావడం వల్ల వస్తుంటాయి.  విటమిన్-సితో కలిపి  విటమిన్-ఇ ఆయిల్‌ని ఉపయోగించడం ద్వారా  ఈ మచ్చలు తొలగించుకోవడమే కాకుండా హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడెలాగో వర్షాకాలం మొదలయ్యింది. వర్షం, చలికి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారి పెదవులు చాలా తొందరగా పగులుతాయి. ఇలాంటి వారు పగిలిన పెదవులు, పెదవుల మూలల్లో విటమిన్-ఇ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చర్మం రిపేర్ అయ్యి సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో విటమిన్-ఇ తో స్కిన్ కు మ్యాజిక్ చేయండి.                                                 *నిశ్శబ్ద.

కళ్ళు పెద్దగా కనపడాలంటే....   అమ్మాయి అందాన్ని పొగడాలంటే ముందుగా కవులు పొగిడేది వాళ్ళ కళ్ళనే. కళ్ళు పెద్దగా ఉంటే చాలు అందం రెండింతలు ఎక్కువవుతుంది. మరి చిన్న కళ్ళు ఉన్న వాళ్ళ సంగతేంటి అంటే దానికీ ఉపాయాలు లేకపోలేదు. వేసుకునే మేకప్ లో, తీసుకునే జాగ్రత్తల్లో కాస్త మెళకువలు పాటిస్తే చాలు చిన్న కళ్ళని కూడా పెద్దగా చూపించచ్చు. మరి అవేంటో చూసేద్దామా. మనం రోజూ పెట్టుకునే కాటుకతో పాటు మరికొన్ని మేకప్ ఐటమ్స్  జతచేసుకోవటం ఎంతైనా అవసరం. ఐ లైనర్ కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది  వేసుకోవటం మొదట్లో కాస్త రాకపోయినా అలవాటయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. మొదటిగా ఒకేసారి కనురెప్పలపై  పెద్దగా ఐ లైనర్ దిద్దుకుని వెళితే మీ స్నేహితులు మిమ్మల్ని ఏడిపించే వీలుంది. కాబట్టి మొదట్లో  రెప్పలపై సన్నగా వేసుకోవటం మంచిది. అలా అలా ఆ లైన్ ని పెంచుతూ వెళ్ళండి.   మస్కారా కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనురెప్పలని పైకి ఒత్తుతూ వేసుకునే మస్కారా వల్ల  కళ్ళు విశాలంగా కనపడతాయి. కొంతమందికి కనుబొమలు, కనురెప్పలు కూడా పల్చగా ఉంటాయి. అలాంటి వాళ్ళ కళ్ళు మరీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే కొన్ని రోజుల్లోనే అవి వత్తుగా మారతాయి. కొంతమంది ఆముదాన్ని కూడా వాడతారు.   కళ్ళకి ఐ లైనర్ పెట్టుకునేటప్పుడు కంటి చివర వరకు  దానిని అప్లై చేస్తూ కాస్త బయటకి కూడా తీసుకెళ్ళి కోన్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే కళ్ళకన్నా కాస్త బయటకి తీసుకెళ్లటం అన్నమాట. రెగ్యులర్ గా ఐబ్రోస్ షేప్ చేయించుకుంటూ ఉండాలి కూడా. ఐబ్రోస్ ఎప్పుడయితే మరీ వత్తుగా ఉంటాయో అప్పుడు అవి కళ్ళని డామినేట్ చేస్తాయి. అలా కాకుండా చూసుకుంటే చాలు.   మనం ఎంత మేకప్ వేసుకున్నా కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ కళ్ళ అందాన్నిదెబ్బతీసి అవి హైలైట్ అవ్వకుండా చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ పోవటానికి ఒక మంచి చిట్కా ఉంది. రెండు స్టీల్ చెంచాలని రాత్రి పడుకునే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. ఉదయం లేవగానే వాటిని కళ్ళపై బోర్లించి మూడు నిముషాలు అలానే ఉంచండి. దీనివల్ల కళ్ళ చుట్టూ ఉండే నలుపు పోవటమే కాదు ఆ రోజంతా కళ్ళు కాస్త పెద్దగా కనిపించటం కూడా మీరే గమనించచ్చు. అలాగే కనురెప్పలు  వెనక్కి వంపు తిరిగి ఉండాలంటే రెండు చెంచాలని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి వాటిని తీసి కనురెప్పలను వంచుతూ వెనక్కి నొక్కి పెట్టి ఆ చెంచాను అలానే ఉంచాలి. రెండు మూడు నిమిషాల తరువాత తీసి చూస్తే రెప్పలు వంపు తిరిగి కనిపిస్తాయి. అవి ఆ రోజంతా అలానే ఉంటాయి కూడా. ఇప్పుడు మార్కెట్ లో ఫాల్స్ ఐ లాషేస్ కూడా దొరుకుతున్నాయి. వాటిని జాగ్రత్తగా పెట్టుకోవటం వస్తే చాలు, వాటివల్ల కూడా కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. మొత్తానికి చిన్నగా కనిపించే కళ్ళు మరింత అందంగా, ఆరోగ్యంగా కనపడాలంటే రోజూ తగినన్ని నీళ్ళు తాగటం మర్చిపోకూడదు. అలాగే కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి వాటి కోసం వాడే ఐ లైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్, కాజల్ ఇలాంటివన్నీ మంచి కంపెనీవి ఎంచుకుని కొనుక్కోవాలి. ఎంతైనా కళ్ళే కదా మనకి అందాన్ని రెట్టింపు చేసేవి. - కళ్యాణి

జుట్టు బాగా రాలిపోతోందా...ఈ నాలుగు వాడితే సెట్! నేటి కాలంలో చాలామంది  జీవనశైలి దారుణంగా తయారైంది.  బయటి ఆహారం,  పానీయాల కారణంగా  శరీరంలో ప్రతి భాగం ఊహించని ప్రతికూలతలు ఎదుర్కొంటుంది. ఇలా ప్రతికూలతలు కలిగే వాటిలో జుట్టు మరీ ముఖ్యమైంది. జుట్టు తెల్లబడటం, రంగు మారటం, చిన్నవయసులోనే బట్టతల, జుట్టు సామర్థ్యం తగ్గడం, పలుచగా మారడం ఇలా చాలా విధాలుగా జుట్టు దెబ్బతింటుంది.  ఇక జుట్టు రాలడం, తలలో చుండ్రు వంటి సమస్యల గురించి చెప్పక్కర్లేదు.  జుట్టు ఎక్కువగా రాలడం వల్ల బట్టతల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆడవారిలో కూడా కనిపించడం చాలా విచారించాల్సిన విషయం.  దీని కోసం ప్రజలు అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్ లు తీసుకుంటారు.  కానీ ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ప్రభావం కనిపించడం లేదు. అయితే  శరీరం అంతర్గతంగా పోషకాలను పొందినప్పుడు మాత్రమే జుట్టు బలంగా ఉంటుంది.  శరీరానికి ఏయే పదార్థాలు లభిస్తే జుట్టు బలంగా ఉంటుంది. వేటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుంటే వాటిని ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యవంతమైన, ధృడమైన జుట్టును పొందవచ్చు. అవేంటంటే.. క్యారెట్ విటమిన్ ఎ క్యారెట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లను బాగా  ఉపయోగించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఇది తలలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు హైడ్రేటెడ్ గా,  ఆరోగ్యంగా మారుతుంది. క్యారెట్ తినడం వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. గుడ్లు గుడ్డులో ఉండే ప్రొటీన్లు జుట్టును లోపలి నుండి దృఢంగా మార్చుతాయి. గుడ్లలో కూడా బయోటిన్ ఉంటుంది, ఇది జుట్టుకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడానికి ప్రయత్నించండి. సిట్రస్ పండ్లు సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. మీ జుట్టు రాలుతున్నట్లయితే, విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితం  ఉంటుంది. అవకాడో అవకాడోలో పొటాషియం, బి విటమిన్లు,  ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు  జుట్టును మందంగా చేస్తాయి.కాబట్టి ఆహారంలో అవోకాడోను చేర్చడానికి ప్రయత్నించండి.                                          *నిశ్శబ్ద

అందమైన గోళ్లు కావాలా ఇదిగో అయిదు టిప్స్ పాటిస్తే చాలు!   అందమైన గోళ్లు ఎంతోమంది అమ్మయిలకు ఇష్టం. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా మెరుస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అందంగా నెయిల్ పాలిష్ వేసుకుని అట్రాక్షన్ గా కనిపించడం కొందరికి ఇష్టమైతే సాధారణంగా గులాబీరంగులో ఉన్న గోళ్లను చూసి మురిసిపోవడం మరికొందరికి ఇష్టం. మొత్తానికి గోళ్ల వల్ల ఏదైనా సమస్య ఉంటే అబ్బాయిలు బెంగ పడిపోతారు.   గోళ్లకు ప్రత్యేక శ్రద్ధ అవసరం, ఎందుకంటే రోజులో  వేడి, తేమ గోళ్లకు తగులుతూ ఉంటాయి. వీటి కారణంగా అవి పొడిగా, పెళుసుగా  మారి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన గోళ్ల రహస్యం ఏమిటా ని చాలా మంది నెట్టింట్లో వెతికేస్తూ ఉంటారు. బలమైన, ఆరోగ్యకరమైన, మెరిసే గోళ్లు కావాలంటే దోసకాయలు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలలో నీరు బాగా ఉంటుంది. అలాగే వీటితో పాటు శరీరానికి సరిపడినంత నీరు తీసుకోవాలి.  గోర్లు మరియు క్యూటికల్స్‌ను ఆరోగ్యంగా  ఉంచడానికి వాటికి మాయిశ్చరైజింగ్ హ్యాండ్ లోషన్ లేదా నెయిల్ ఆయిల్‌ను అప్లై చేయవచ్చు. గోరు సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు: చేతి తొడుగులు ధరించాలి.. కఠినమైన రసాయనాలు, దుమ్ము, ధూళి చేతులకు తగిలే పరిస్థితులు ఉన్నప్పుడు గోళ్లను రక్షించడానికి గ్లౌజులు ధరించాలి. సింకులో పాత్రలు కడగడం, టాయిలెట్ క్లినింగ్, రసాయనాలు ముట్టుకోవడం వంటి సందర్భాల్లో గ్లౌజులు బెస్ట్ ఆప్షన్. ఇదంతా విదేశాల్లో చేస్తారు మనకెందుకు అనుకుని తీసిపారేయాల్సిన అవసరం లేదు. మంచి చేకూర్చే అలవాటు ఏదైనా పాటించడంలో తప్పులేదు. విటమిన్ డి.. విటమిన్ డి ఆరోగ్యకరమైన గోళ్లను అందిస్తుంది. సూర్యరశ్మి ద్వారా ఇది మనకు లభిస్తుంది. అయితే ఎక్కువ ఎండకు గోర్లు గురైనప్పుడు గోళ్లు పెళుసుబారతాయి.  మీ గోర్లు ఎండిపోవచ్చు, రంగు మారవచ్చు లేదా ఎక్కువ సూర్యరశ్మితో పగుళ్లు రావచ్చు. బయట ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, మీ చేతులు మరియు గోళ్లకు సన్‌స్క్రీన్‌ అప్లై చేయాలి. ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోకండి.. చర్మాన్ని  ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల గోళ్లు, క్యూటికల్స్ కూడా ప్రయోజనం పొందుతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, గోళ్లకు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి, మృదువైన నెయిల్ బ్రష్ లేదా బాడీ స్క్రబ్ ఉపయోగించాలి.  అదనంగా, ఇది మీ క్యూటికల్స్ ఆరోగ్యంగా కనిపించేలా, పెరుగుదల లేకుండా ఆగిపోయిన గొళ్లను మళ్ళీ పెరిగేలా చేస్తుంది.  గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి..  పొడవాటి గోళ్లు అందంగా అనిపించవచ్చు, కానీ గాఢత కారణంగా అవి విరిగిపోయి, గీసుకోవడం కోసుకోవడం జరిగి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి.  దీనివల్ల గోళ్ల పరిశుభ్రతను కొనసాగించడం సులభం అవుతుంది.  నెయిల్ పాలిష్ నుండి విరామం తీసుకోవాలి.. నెయిల్ పాలిష్ వేసుకోవడం  చాలామందికి ఇష్టం. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ నెయిల్ పాలిష్ నుండి  గోళ్లకు విరామం ఇవ్వడం చాలా ముఖ్యం.  అన్ని సమయాల్లో నెయిల్ పాలిష్ ధరిస్తే గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారవచ్చు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తుండాలి.                                    ◆నిశ్శబ్ద.

ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ ఫేస్ మాస్క్ బెస్ట్! అమ్మాయిలు తమ ముఖం చాలా అందంగా కనిపించాలని అనుకుంటారు. ఇక ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాలలో ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం చాలా రకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు, బ్యూటీ థెరపీలు తీసుకుంటారు. అయితే ముఖం కాంతివంతంగా కనిపించడానికి  కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు చాలా బెస్ట్ గా పనిచేస్తాయి. అలాంటి వాటిలో మందార పువ్వుల ఫేస్ మాస్క్ చాలా బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. ఇంతకీ ముఖం మెరిసిపోవాలి అంటే మందార ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్ ఏంటి?  తెలుసుకుంటే.. మందార పువ్వులను హైబిస్కస్ అని కూడా అంటారు. ఇది జుట్టుకు, చర్మానికి చాలా గొప్పగా సహాయపడుతుంది. మందార పువ్వులతో ఫేస్ మాస్క్ వేస్తుంది ముఖం యవ్వనంగా మారుతుంది.  ముఖం మీద ముడుతలు, గీతలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. మందార ఫేస్ మాస్క్ వేసుకోవడానికి కావలసిన పదార్థాలు.. మందార పొడి 2 టేబుల్ స్పూన్లు.. పచ్చి తేనె 1 టేబుల్ స్పూన్..   పాలు.. 1 టేబుల్ స్పూన్.. పై మూడు పదార్థాలను ఒక చిన్న గిన్నెో వేసి బాగా మిక్స్ చేసి మెత్తని పెస్ట్ లా చేసుకోవాలి.   మొదట ముఖాన్ని చల్లని నీటిలో శుభ్రపచుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందైనా ఇదే పని చేయాలి. ఇలా చేస్తే ఫేస్ ప్యాక్ తాలూకు మెరుపు, వాటిలోని గుణాలు చర్మానికి బాగా పనిచేస్తాయి. ముఖం  శుభ్రం చేసుకున్నతరువాత తయారుచేసుకున్న మందార పువ్వుల మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ ను ముఖం మీద 20నిమిషాల పాటూ  అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. మందార ఫేస్ ప్యాక్ ను పాలతోనే కాకుండా మరొక విధంగా కూడా ట్రై చేయవచ్చు.. మందార పొడి 2 టేబుల్  స్పూన్లు.. తేనె 1 టీ స్పూన్.. పెరుగు కొద్దిగా.. పై మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు  ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  సుమారు 15 నిమిషాలు దీన్ని అలాగే ఉంచి ఆ తరువాత కాటన్ సహాయంతో ముఖం మీద ఉన్న ఫేస్ మాస్క్ ను తొలగించాలి.  దీని తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు మొత్తం ముఖానికి ఎలాంటి సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ ఉపయోగించకూడదు.                                           *నిశ్శబ్ద.  

మచ్చలేని ముఖం కావాలా? ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..! ప్రతి ఒక్కరూ శుభ్రమైన,  మొటిమలు లేని చర్మాన్ని కోరుకుంటారు. కానీ బిజీ రొటీన్‌లో చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో చర్మసంరక్షణకు బోలెడు రకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి.  వీటని చర్మంలో మెరుపు కనిపించాలని, చర్మం యవ్వనంగా కనిపించాలని వాడతారు. ఇవి వాడినప్పుడు నిజంగానే అనుకున్న ఫలితాలను కేవలం క్షణాలలో ఇస్తాయి. అయితే వీటని ముఖానికి పట్టింటి రిమోవ్ చేస్తే ఆ తరువాత ముఖం చాలా చండాలండా మారుతుంది. ముఖ చర్మం దారుణంగా మారుతుంది. డ్యామేజ్ అవుతుంది. అమ్మాయిలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, డేట్ నైట్లు మొదలైనవాటి కోసం చాలా అందంగా తయారవుతారు కూడా. అయితే అలాంటి సందర్భాలలో సహజంగానే అందంగా, మచ్చలేని చర్మంతో మెరిసిపోవాలంటే మాత్రం ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి. గంధం,  గులాబీ రేకుల పేస్ట్.. గంధం,  గులాబీ రేకుల పేస్ట్  శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉత్తమ ఎంపిక. ఇది  సహజంగా మంచి సువానసను కలిగి ఉంటుంది.   గంధం,  గులాబీ రేకులతో తయారు చేసిన పేస్ట్  చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖంలోని మురికిని శుభ్రపరచడమే కాకుండా మృతచర్మాన్ని కూడా తొలగిస్తుంది. కావలసినవి - 2 టేబుల్ స్పూన్లు గంధపు పొడి ఒక పిడికెడు  ఎండు గులాబీ రేకులు 1 టేబుల్ స్పూన్  పెరుగు ఎలా చేయాలి ముందుగా ఎండిన గులాబీ రేకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గంధపు పొడికి గులాబీ రేకుల పొడి కలపాలి. దీన్ని పేస్ట్ చేయడానికి  పెరుగును ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. దీని తర్వాత పొడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకుని ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.   కుంకుమ పువ్వు, పాలు.. సహజ పదార్థాలు ఎల్లప్పుడూ ముఖ సంరక్షణ కోసం చాలా మంచి ఎంపిక. కుంకుమపువ్వు అలాంటి  సహజ పదార్ధాలలో ఒకటి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. కుంకుమపువ్వు కేవలం రంగు మాత్రమే కాదు.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇక పాలలోని పోషక గుణాలు చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. ఈ రెండూ కలిస్తే ముఖ చర్మానికి చక్కగా పనిచేస్తాయి. కావలసినవి:  కుంకుమపువ్వు రేకలు  2 టేబుల్ స్పూన్ల పాలు   1టేబుల్ స్పూన్  శనగపిండి ఎలా చేయాలి..  కుంకుమపువ్వు రేకలను పాలలో కొన్ని  నానబెట్టాలి. ఇప్పుడు శనగపిండిని అందులో  వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. వేప తులసి పేస్ట్.. వేప,  తులసితో చేసిన పేస్ట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని  ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుపుతో కూడిన ఆరోగ్యకరమైన చర్మం  సొంతం అవుతుంది. కావలసినవి.. ఒక పిడికెడు వేప ఆకులు ఒక పిడికెడు తాజా తులసి ఆకులు 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి ఎలా చేయాలి..  వేప,  తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ముల్తానీ మట్టిని పేస్ట్‌లో కలపాలి. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  ఇప్పుడు గోరువెచ్చని నీటితో కడిగి, టవల్ తో తుడుచుకుని మైల్డ్ లోషన్ లేదా క్రీమ్ రాయాలి. గంధం, బాదం పేస్ట్.. గంధం,  బాదంతో  తయారుచేసుకున్నపేస్ట్  చర్మ కాంతిని పెంచడమే కాకుండా చర్మానికి చలువదనాన్ని   ఇస్తుంది కావలసినవి.. 2 టేబుల్ స్పూన్ గంధపు పొడి 1 టేబుల్ స్పూన్  బాదం పొడి 1 టేబుల్ స్పూన్  తేనె కొన్ని చుక్కల పాలు ఎలా తయారు చేయాలి.. గంధం  బాదం పేస్ట్  కోసం చందనం, బాదం పొడి  ఒక గిన్నెలో వేయాలి. దీన్ని పేస్ట్ చేయడానికి తేనె,  తగినంత పాలు జోడించాలి.  దీన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న  స్క్రబ్స్  చర్మానికి మెరుపు అందించడానికి, చర్మం మీద మురికి తొలగించడానికి సహజమైన చిట్కాలలా పనిచేస్తాయి.  ఇవన్నీ  సహజ పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండటం కోసం . వీటిని ఉపయోగించే  ముందు చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం.                                           *నిశ్శబ్ద.   

  కొరియన్ అమ్మాయిల గ్లాసీ స్కిన్ సీక్రెట్ ఇదే..! బ్యూటీ ప్రపంచంలో కొరియన్ అమ్మాయిల రూటే సపరేటు. చాలామంది కొరియన్ అమ్మాయిల లాంటి స్కిన్ టోన్ తెచ్చుకోవడం కోసం బోలెడు చిట్కాలు పాటిస్తుంటారు. కొరియన్ అమ్మాయిల ముఖ చర్మం మచ్చలు, ముడతలు లేకుండా అద్దంగా మెరుస్తూ ఉండటమే కొరియన్ అమ్మాయిలకు క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.  అయితే కొరియన్ అమ్మాయిలు తమ ముఖ చర్మం అద్దంలా మెరవడం కోసం ఈ కింది సప్లిమెంట్లు తీసుకుంటారు. అవేంటో తెలుసుకుంటే.. గ్రీన్ టీ.. గ్రీన్ టీ శతాబ్దాలుగా కొరియన్ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పాలీఫెనాల్స్,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ సప్లిమెంట్ గా పేర్కొనబడుతుంది. జీవక్రియను పెంచడానికి, గుండె ఆరోగ్యానికి,  బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. పసుపు.. కొరియన్ వంటకాలలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శోథ నిరోధక,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. విటమిన్-సి.. విటమిన్ సి భారతీయులు కూడా చాలా విరివిగా తీసుకుంటారు.  ఇందులో  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  రోగనిరోధక వ్యవస్థను  బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొరియన్లు తరచుగా వారి ఆహారంలో సిట్రస్ పండ్లు, బెర్రీలు,  ఆకుపచ్చ కూరగాయలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటారు.  కొందరు విటమిన్ సి సప్లిమెంట్లపై ఆధారపడతారు. కొల్లాజెన్.. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కొల్లాజెన్ పాత్ర ముఖ్యమైనది. కొల్లాజెన్ ఒక ప్రోటీన్. ఇది చర్మం, జుట్టు,  గోర్లు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలా మంది కొరియన్లు తమ బ్యూటీ డైట్‌లో కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకుంటారు. ఈ సప్లిమెంట్లు చర్మ స్థితిస్థాపకత,  ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తాయని నమ్ముతారు. అంతే కాదు ముఖంపై వచ్చే ముడతలను తగ్గించుకోవడానికి ఇది మంచి మార్గం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు.. సాల్మన్,  మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో సమృద్ధిగా లభించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ప్రతి ఒక్కరూ చేపలను క్రమం తప్పకుండా తినరు కాబట్టి, చాలా మంది కొరియన్లు ఒమేగా-3 సప్లిమెంట్లను  ఎంచుకుంటారు. ముఖ్యంగా చేపనూనె లేదా ఆల్గే కలిపి తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. ప్రోబయోటిక్స్..  దక్షిణ కొరియాలో ఈ ప్రోబయోటిక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కిమ్చి, పెరుగు,  ఇతర సాంప్రదాయ కొరియన్ వంటకాలు,  పులియబెట్టిన ఆహారాలు మంచి బ్యాక్టీరియాను తీసుకోవడానికి దోహదం చేస్తాయి. అయినప్పటికీ చాలా మంది కొరియన్లు జీర్ణ ఆరోగ్యాన్ని,  రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ప్రోబయోటిక్ సప్లిమెంట్లను తీసుకుంటారు. రెడ్ జిన్సెంగ్.. రెడ్ జిన్సెంగ్ ఒక ప్రసిద్ధ సాంప్రదాయ కొరియన్ రెమెడీ. ఇందులో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది,  శక్తి స్థాయిలను పెంచుతుంది. రెడ్ జిన్‌సెంగ్‌ను కొరియన్లు క్యాప్సూల్స్, ఎక్స్‌ట్రాక్ట్‌లు, టీలు,  టానిక్‌లలో ఒక భాగంలా తీసుకుంటారు.                                        *నిశ్శబ్ద.

అదిరే అదరాల కోసం..   ఎవరి ముఖమైనా చూడగానే మొదట కనిపించేది పెదాలు...ఎర్రని పెదవుల మధ్య నుంచి చిరునవ్వులు చిందించగానే ఎదుటివారికి అదో ఆత్మీయ పలకరింత. పెదాలు అందంగా ఉంటేనే మొహం అందంగా కనిపిస్తుంది. మొహం తెల్లగా ఉన్నా కూడా పెదాలు అంద విహీనంగా ఉంటే ఉపయోగం లేదు. అదే ముఖం నల్లగా ఉన్నా పెదాలు ఎర్రగా ఉంటే ఆ కళే వేరు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పెదాలను మరింత అందంగా ఉంచుకోవటానికి ముఖ్యంగా అమ్మాయిలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. మార్కెట్లో కొత్తగా వచ్చిన లిప్‌బామ్‌లు, లిప్‌స్టిక్‌లు పూయడమే పనిగా పెట్టుకుంటారు...వీటి వల్ల అందం పెరగటం మాట అటుంచితే ధీర్ఘకాలంలో పెదవుల సౌందర్యం పాడయ్యే అవకాశం ఉంది. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువల సాయంతోనే పెదాలను అందంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం.. * బీట్‌రూట్ రసం తీసుకుని, దానికి మీగడ కలిపి పెదాలపై రుద్దాలి. కొద్ది సమయం తర్వాత చల్లని నీటితో దానిని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్‌గా అవ్వడంతో పాటు ముడతలు పోతాయి. * మరీ పోడిబారిన చర్మతత్వం ఉన్నవారు ఒక చెంచా సెనగపిండిలో తగినంత బాదం నూనె కలిపి పొడిబారిన పెదాల దగ్గర రాసి ఆరిన తర్వాత కడిగేయొచ్చు. నెమ్మదిగా సమస్య తగ్గుముఖం పడుతుంది. * నిమ్మరసాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి రాత్రంతా ఉంచేయాలి. తెల్లవారిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో తేనే కలిపి రాసిన ప్రయోజనం ఉంటుంది. * తాజాగా తీసిన కలబంద గుజ్జుని పెదాలపై అప్లై చేసి రాత్రంతా ఉంచి తెల్లారి కడిగేయటం వల్ల పెదాల తగ్గుతుంది. * పెదాలు రంగు మారడంతో పాటు తరచూ పగులుతుంటే రాత్రి పోడుకునే ముందు నెయ్యితో మర్ధన చేసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది. * గులాబీ రెమ్మలను పేస్ట్‌గా చేసి, ఆ పేస్ట్‌కు కాసిన్ని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ వర్ణంలోకి మారి అందంగా ఉంటాయి. * తరచూ నాలుకతో పెదాలను తడుపడం మానండి..దీని వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. * నీరు, తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

కొబ్బరినూనెలో ఇవి రెండూ కలిపి తలకు రాస్తే చాలు.. మొండి చుండ్రు కూడా మటుమాయం! జుట్టుకు సంబంధించిన సమస్యలలో చుండ్రు చాలా సాధారణమైన విషయం. తేలికపాటి చుండ్రు సమస్య ఉంటే అది పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కానీ చుండ్రు సమస్య ఎక్కువ ఉంటే మాత్రం అది అనుభవించేవారికి నరకాన్ని పరిచయం చేస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చుండ్రు కారణంగా జుట్టు బలహీనంగా మారడం, కాంతి కోల్పోవడం, రాలిపోవడం జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే  కొబ్బరినూనెలో కేవలం రెండు పదార్థాలు కలిపి రాస్తే చాలు. మొండి చుండ్రు కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం, ఉపయోగించే తీరు పూర్తీగా తెలుసుకుంటే.. చుండ్రు తగ్గించుకోవడానికి తలకు కర్పూరం, నిమ్మకాయ నూనె తయారుచేసుకోవాలి. దీన్ని వారంలో మూడు సార్లు ఉపయోగించాలి. ఈ నూనె తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే.. భీమసేని కర్పూరం..2,3 నిమ్మకాయ.. సగం కొబ్బరినూనె..  ఒక కప్పు మొదట భీమసేని కర్పూరాన్ని బాగా పొడిగా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సగం నిమ్మకాయను పిండి రసం తీసి  ఆ రసాన్ని కలపాలి. దీంట్లో వేడిచేసిన కొబ్బరినూనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వారంలో మూడుసార్లు దీన్ని తలకు పట్టించి తలస్నానం చేస్తుంటే తలలో చుండ్రు చాలా సులువుగా తగ్గిపోతుంది. ఈ నూనెను ఎక్కువగా కాకుండా కొద్దిమొత్తంలో తయారుచేసుకుని అప్పటికప్పుడు వాడుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నూనె ఎలా పనిచేస్తుందంటే.. వాస్తవానికి భీమసేని కర్పూరం యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగస్ పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే స్కాల్ప్ కు చల్లదనాన్ని అందించడం ద్వారా చికాకును తగ్గించడంలో  సహాయపడతుంది.  దీన్ని  జుట్టుకు అప్లై చేస్తే  జుట్టు కుదుళ్లను తెరవడంలో సహాయపడుతుంది,  జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే  నిమ్మరసం దాని ఆమ్ల గుణాల కారణంగా జుట్టు pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది  ఫంగస్ పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి ఇది తయారు చేయడం సులభం, వాడటం కూడా సులువు  మాత్రమే కాకుండా ప్రభావవంతంగా ఉంటుంది.                                               *నిశ్శబ్ద.  

అమ్మాయిలూ.. రోజ్ వాటర్ ను ఇలా అస్సలు వాడకండి! రోజ్ వాటర్ అమ్మాయిలు చాలా ఎక్కువగా  ఉపయోగించే సౌందర్య సాధనం. నేరుగా ముఖానికి పట్టించాలన్నా, టోనర్ గా వాడాలన్నా, మేకప్ తొలగించిన తరువాత  ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచాలన్నా, ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించాలన్నా రోజ్ వాటర్ చాలా విరివిగా ఉపయోగిస్తారు. బోలెడు బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయనే కారణంతో చాలామంది అమ్మాయిలు రోజ్ వాటర్ ను వివిధ పదార్థాల కాంబినేషన్  లో ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖం చాలా చండాలంగా మారుతుంది. అకారణంగా ముఖం మీద దద్దుర్లు,  మచ్చలు రావడం. ముఖ చర్మం పాడైపోవడం జరుగుతుంది. అసలు రోజ్ వాటర్ వల్ల కలిగే లాభాలేంటి? దీన్ని ఎలా వాడితే  ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఎలా వాడకపోవడం మంచిది? పూర్తీగా తెలుసుకుంటే.. గులాబీ రేకులను ఆవిరి చెయ్యడం ద్వారా గులాబీ నీరు తయారు చేస్తారు. ఇది ముఖం మీద గీతలు, మచ్చలు తొలగించడమే కాకుండా ముడుతలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే రోజ్ వాటర్ లో కొన్ని రకాల పదార్థాలను కలపడం వల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది. రోజ్ వాటర్ లో నూనె పదార్దాలు కలిపి రాయకూడదు. రోజ్ వాటర్ నీటి గుణం కలిగి ఉంటుంది, నూనె రోజ్ వాటర్ లో సరిగా  కలవదు.  ఈ కారణంగా ముఖం మీద నీరు, నూనె గందరగోళం సృష్టించి  మచ్చలు రావడానికి కారణం అవుతుంది.  మొదట శుభ్రమైన ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేసి ఆరిన తరువాత దానిమీద ఫేస్ ఆయిల్ అప్లై చెయ్యాలి. విటమిన్-సి అధికంగా ఉండే నిమ్మరసం, నారింజ రసం వంటివి రోజ్ వాటర్ లో కలపకూడదు. ఇది చర్మాన్ని చికాకు పెడుతుంది. ర్యాషెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కొందరికి టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి వాడే అలవాటు ఉంటుంది. అయితే ఆల్కహాల్ ఆధారిత టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి అస్సలు వాడకూడదు. మరీ ముఖ్యంగా సున్నిత చర్మం ఉన్నవారు, పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా నష్టం కలిగిస్తుంది. రోజ్ వాటర్ ను ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తుంటారు. సున్నిత చర్మం, పొడిచర్మం ఉన్నవారు దీన్ని వాడకపోవడం మంచిది. ముల్తానీ మట్టిలో PH స్థాయిలు ఉంటాయి. ఇవి ముఖాన్ని పాడు చేస్తాయి.                                 *నిశ్శబ్ద.  

చలికాలంలో మెరిసే జుట్టు సొంతం కావాలంటే.. ఇలా చేయండి! శీతాకాలంలో జుట్టు తరచుగా పొడిగా,  గరుకుగా మారుతుంది. దాదాపు ప్రతీ అమ్మాయి సీజన్ తో సంబంధం లేకుండా అందంగా ఉండాలని ఎలా కోరుకుంటుందో జుట్టు కూడా అలాగే మెరుస్తూ ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మెరిసే జుట్టు ఎప్పుడూ దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ చలికాలంలో జుట్టు మెరుపు కోల్పోవడం వల్ల జుట్టు బలహీన పడి క్రమంగా జుట్టు రాలిపోతుంది కూడా. అందుకే చలికాలంలో జుట్టుకోసం ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగని జుట్టును  జాగ్రత్తగా చూసుకోవడానికి శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు. జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది టిప్స్ పాటిస్తే సరి.. పెరుగు.. తలకు పెరుగుతో  హెయిర్ ప్యాక్ వేసుకుంటే  చాలా ప్రయోజనాలు ఉంటాయి.  జుట్టుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా మొండి చుండ్రు ఉంటే పెరుగును కొద్దిగా నీరు లేదా రోజ్ వాటర్‌తో కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. మెరిసే జుట్టు కావాలంటే ఈ మిశ్రమంలో  తేనెను కూడా కలుపుకోవచ్చు. అలోవెరా.. కలబంద జుట్టు సంరక్షణలో చక్కగా సహాయపడుతుంది. జుట్టును మాయిశ్చరైజ్ చేసి మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.  తాజా అలోవెరా జెల్ లో ఆలివ్ కలిపి తలకు హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గంట తరువాత తల స్నానం చెయ్యాలి. ఇది జుట్టును సిల్కీగా మారుస్తుంది. ఉసిరికాయ.. ఈ వింటర్ సీజన్ లో ఉసిరికాయలు  మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఉసిరికాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. కోల్పోయిన మెరుపును తిరిగి అందిస్తుంది. తెల్లజుట్టు సమస్య తగ్గించడంలోనూ, చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలలోనూ ఉసిరికాయ  సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు ఇస్తుంది. షియా బటర్.. దీన్నే షీ బటర్ లేదా షియా వెన్న అని కూడా అంటారు. జుట్టు మెరుపును పెంచడంలో షియా బటర్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని నిమ్మకాయతో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మెరిసే జుట్టు కావాలంటే నిమ్మరసంలో షియా బటర్ మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత  జుట్టును నీటితో కడగాలి. జుట్టుకు మెరుపును ఇవ్వడమే కాదు.. జుట్టు ఆకృతిని కూడా చక్కగా ఉంచుతుంది.                                        *నిశ్శబ్ద.

అధికశాతం మంది ఫాలో అయ్యే ఈ బ్యూటీ టిప్స్ తో చాలా డేంజర్..! అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు అందంగా కనిపించడం ఇష్టం. అబ్బాయిలు కూడా తామేమీ తీసిపోవట్లేదని నిరూపిస్తూ ఫేష్ వాష్ లు, బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. చాలామంది అమ్మాయిలు సూర్యకిరణాల వల్ల నలుపెక్కిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నో బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. మరికొందరు వాణిజ్య ఉత్పత్తులలో ఉన్న రసాయనాలకు భయపడి ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. ఇవి మాత్రమే కాకుండా మొటిమలు, మచ్చలు, కాంతి వంతమైన చర్మం,  కళ్ల కింద నల్లటి వలయాలు, ముడుతలు తగ్గించడం ఇలా చాలా వాటికి ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు.  అయితే  చాలా మంచివి అనుకుంటూ అమ్మాయిలు ఇంట్లో వాడే కొన్నిహోం రెమిడీస్ చర్మాన్ని దారుణంగా దెబ్బతీస్తాయట. అవేంటో తెలుసుకుంటే.. శనగపిండి.. భారతదేశంలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉపయోగించే సౌందర్య సాధనం శనగపిండి. వంటిట్లో ఉండే ఈ పిండిని ఫేస్ ప్యాక్ గా వేయడం నుండి ఫేష్ వాష్ గా కూడా వాడుతుంటారు. చిన్న పిల్లలకు శనగపిండి స్నానపు పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే శనగపిండి చర్మాన్ని చికాకు పరిచే అవకాశం ఉంటుంది. ట్యాన్ తొలగించడానికి బదులు చర్మం మీద ర్యాషెస్, దద్దుర్లు రావడానికి దారితీస్తుంది. వాల్నట్ స్క్రబ్.. చాలామంది అమ్మాయిలు ముఖం మీద మృతకణాలు, మచ్చలు, చర్మం గుంటలు పోవడానికి వాల్నట్ స్క్రబ్ ఉపయోగిస్తారు. అయితే ఇది మఖ చర్మాన్ని పాడుచేస్తుంది. ముఖ చర్మం సున్నితంగా అయ్యేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి  వాల్నట్ స్క్రబ్ అస్సలు మంచిది కాదు.  వాల్నట్ స్క్రబ్ కు బదులుగా పెరుగు ఉపయోగించవచ్చు. డెడ్ స్కిన్ ను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. నిమ్మరసం.. ముఖ చర్మం కాంతివంతంగా మారడం కోసం చాలామంది నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఇతర సిట్రస్ పండ్లు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా అయితే చేస్తుంది కానీ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. సూర్యకిరణాల ధాటికి చర్మం తొందరగా నల్లబడటం, చర్మ సమస్యలకు తొందరగా గురికావడం జరుగుతుంది. కాంతివంతమైన చర్మం కావాలని అనుకుంటే విటమిన్-సి సీరమ్ వాడాలి. ఆపిల్ వెనిగర్.. ఆపిల్ వెనిగర్ ను చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది ఘాడత ఎక్కువ ఉన్న కారణంగా తొందరగా చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. దీని  బదులు లాక్టిక్ యాసిడ్ సీరమ్ అప్లై చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.                                       *నిశ్శబ్ద.  

ఈ బయోటిన్ పౌడర్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..! జుట్టు రాలే సమస్య అందరినీ వేధిస్తోంది. కానీ కారణాలు అందరికీ భిన్నంగా ఉండవచ్చు. కొందరికి నీటి వల్ల జుట్టు రాలిపోతే, మరికొందరికి చుండ్రు వంటి పోషకాల కొరత వల్ల జుట్టు రాలిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సమస్యకు కొన్ని రకాల ఇంటి నివారణలు,  ఔషధాలను ప్రయత్నించారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి చిట్కాలు: జుట్టు రాలడాన్ని తగ్గించడానికి.. మీ జుట్టును ఒత్తుగా మార్చడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. విటమిన్ B7, కొన్నిసార్లు విటమిన్ H లేదా బయోటిన్ అని పిలుస్తారు.ఇది జుట్టును బలపరిచే, జుట్టు రాలడాన్ని తగ్గించే సప్లిమెంట్ బయోటిన్ కొత్త కణాల నిర్మాణం రేటును పెంచుతుంది.  జుట్టు పల్చబడడాన్ని నివారిస్తుంది. సహజంగా జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి మృదుత్వాన్ని పెంచుతుంది. బయోటిన్ లోపం: బయోటిన్ లోపం అసాధారణం అయినప్పటికీ..అది లోపించినప్పుడు జుట్టు రాలుతుంది.  సమతుల్య ఆహారం తీసుకునేవారిలో లోపం చాలా అరుదు. ఇంట్లోనే బయోటిన్ పౌడర్‌ను తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక సాధారణ పద్ధతి ఉంది.అవేంటో చూద్దాం. వీటిని ఆహారంలో  చేర్చుకుంటే: కాయధాన్యాలు, సోయాబీన్స్,  ఇతర చిక్కుళ్ళు బయోటిన్‌ను అందిస్తాయి. వోట్స్, బార్లీ,  హోల్ వీట్ వంటి తృణధాన్యాలు బయోటిన్ యొక్క మంచి మూలాలు. బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలు,  వాల్‌నట్ వంటి నట్స్‌లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. సాల్మన్,  ట్యూనాతో సహా కొన్ని రకాల చేపలలో బయోటిన్ ఉంటుంది.వీటిని పొడిరూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంట్లోనే బయోటిన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి? కావలసినవి: ½ కప్ బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజ, వాల్‌నట్ పౌడర్ ½ కప్ వోట్స్ లేదా బార్లీ ½ కప్పు శనగపిండి, చిక్‌పీస్ ½ కప్పు చియా గింజలు ½ కప్పు అవిసె గింజలు తయారీ విధానం: పై పదార్థాలన్నింటిని గ్రైండర్ లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడొక జార్ తీుసకుని ఆ పొడిని అందులో వేసుకోవాలి. ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. దీనిని మీరు స్మూతీ లేదా టీలో కానీ కలుపుని తీసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ బయోటిన్ పౌడర్ కలుపుకుని తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం తాగుతే మంచి ఫలితం ఉంటుంది.

చలికాలం ముఖం నిర్జీవంగా మారిందా..అయితే ఈ 5 చిట్కాలతో మెరుపు ఖాయం..! చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొరలు పొరలుగా పగిలిపోతూ ఉంటుంది. దీంతో కొంతమందికి చాలా చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం ఈ విధంగా పగిలిపోవడం ద్వారా కొత్త చర్మం ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో కొద్దిమంది ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. చర్మం పొడిగా మారడం ద్వారా ర్యాషెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖం కూడా కాంతివంతం కోల్పోయే ప్రమాదం అవుతుంది. ఇలాంటి సమయంలో చలికాలంలో చర్మం పగలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చర్మం పగలకుండా ఇంటి చిట్కాల ద్వారా మీరు మృదువైన  స్కిన్  పొందే అవకాశం ఉంది.  ఇందుకోసం పాటించాల్సిన ఐదు చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరిపాలతో స్క్రబ్:   కొబ్బరి పాలు అనేవి సహజమైన మాయిశ్చరైజర్ గా ఉపయోగపడతాయి.  పచ్చి కొబ్బరి పాలను  సేకరించి వాటితో మీ మొహంపై  సున్నితంగా స్క్రబ్ చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతం కోల్పోదు.  అలాగే కొబ్బరి పాలలోని సహజమైన మాయిశ్చరైజర్..  మీ చర్మ గ్రంధులను పునరుజీవం చేస్తుంది.  వారానికి రెండుసార్లు ఇలా చేసుకున్నట్లయితే మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది. పచ్చిపాల మీగడతో ఫేస్ ప్యాక్:   పచ్చిపాల మీగడ అనేది సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్.  పచ్చిపాలను ఒక కప్పులో తీసి  వాటిని ఫ్రిజ్లో పెట్టండి.  అప్పుడు దానిమీద  మందంగా  మీగడ ఏర్పడుతుంది.   ఈ మీగడను సేకరించి  ప్రతిరోజు ముఖంపై  అప్లై చేస్తే  ముఖం కాంతివంతంగా అదే విధంగా  పగిలిన చర్మం పునర్జీవంగాను కనిపిస్తుంది. ఆలివ్ నూనె మసాజ్:   ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు.  ఆలివ్ నూనె సహజమైన  మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది.  కొద్ది చుక్కల ఆలివ్ ఆయిల్ ను  మీ ముఖానికి  రాసుకున్నట్లయితే.  చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.  అలాగే  పగిలిన చర్మం  పునరుజీవంగా కనిపిస్తుంది. కొబ్బరి నూనె లో కలబంద:   కొబ్బరి నూనెలో  ఒక స్పూను అలోవెరా జెల్ కలిపి  ముఖానికి రాసుకున్నట్లయితే   సహజమైన మాయిశ్చరైసర్ గా ఉపయోగపడుతుంది.  అంతేకాదు కలబందలోని యాంటీబయోటిక్ లక్షణాలు  మీ చర్మంపై  ఉన్నటువంటి క్రిములను తొలగిస్తాయి.  తద్వారా మీ ముఖం  కాంతివంతంగా కనిపిస్తుంది.  నువ్వుల నూనెతో మసాజ్:   నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.  చలికాలంలో మీ చర్మం పగలకుండా ఉండాలంటే.  కొన్ని చుక్కల నువ్వుల నూనెను శరీర భాగాలపై రాసుకున్నట్లయితే  చర్మం సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ ను కోల్పోదు.  మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.  ముఖంపై కూడా నువ్వుల నూనెను కొద్ది చుక్కలు రాసుకున్నట్లయితే సహజ సిద్ధమైన మాయిశ్చరైసర్ గా పని చేస్తుంది.  

ముఖ చర్మం రంధ్రాలు తగ్గించడం ఎలాగో తెలుసా? కొందరికి ముఖం మీద చర్మం రంధ్రాలలా కనబడుతుూ ఉంటుంది. ఇది చర్మ గంధ్రులు తెరచుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ తెరచుకున్న రంధ్రాల కారణంగా మొటిమలు, మచ్చలు, దుమ్ము, ధూళి పేరుకోవడమే కాదు.. చర్మం చాలా తొందరగా ముడుతలు పడినట్టు, వృద్దాప్యం మీద పడినట్టు అనిపిస్తుంది. చర్మం మీద ఉన్న ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించడం కష్టమే కానీ అసాద్యం మాత్రం కాదు. చాలా మంది వీటని తగ్గించుకోవడానికి వాణిజ్య ఉత్పత్తులను వాడుతుంటారు.  ఇవి వాడినంత సేపు చర్మం బిగుతుగా, రంధ్రాలు లేకుండా ఉంటుంది. కానీ తరువాత మళ్లీ మొదటికి వస్తుంది.  అలా కాకుండా ఇంటి పట్టునే సులువైన చిట్కాలతో ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించుకోవచ్చు.  అందుకోసం ఫాలో కావాల్సిన చిట్కాలు ఇవీ.. ఐస్.. ఓపెన్ పోర్స్ తగ్గించుకోవడానికి మంచు ముక్కలు బాగా సహాయపడతాయి. ఒక క్లాత్ లో మంచుముక్కలు ఉంచి ఆ క్లాత్ ను 15 నుండి 30 సెకెన్ల పాటు ముఖ చర్మం మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మాన్ని బిగుతుగా చేయడం, చర్మ రంధ్రాలు మెల్లిగా తగ్గడం జరుగుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్.. నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమాన భాగంలో తీసుకోవాలి. దీంట్లో కాటన్ బాల్ ముంచి ఈ ద్రావణాన్ని ముఖమంతా పట్టించాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత ముఖాన్ని కడిగేయాలి.  యాపిల్ సైడర్ వెనిగర్ లో  ఉండే అస్ట్రింజెంట్ గుణాలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడంలో సహాయపడతాయి. గుడ్డు తెల్ల సొన.. గుడ్డులో ఉండే తెల్లసొన చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. గుడ్డు తెల్ల సొనను చర్మానికి అప్లై చేసి 15నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో, రంధ్రాలను చిన్నగా చేయడంలో సహాయపడతాయి. టమోటా  మాస్క్.. మిక్సీలో టమోటా వేసి  పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ వేయాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. టమోటాలో ఉండే సహజ ఆమ్లత్వం చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా స్క్రబ్.. కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి వృత్తాకారంగా చర్మం మీద స్క్రబ్ చేయాలి. ఆ తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మృతకణాలను తొలగిస్తుంది.  మూసుకుపోయిన చర్మరంధ్రాలను క్లియర్ చేస్తుంది. గ్రీన్ టీ.. గ్రీన్ టీ చర్మానికి చాలా మేలుచేస్తుంది. కాటన్ బాల్ ఉపయోగించి  గ్రీన్ టీని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆ తరువాత 15 నిమిషాలు అలాగే ఉంచి   ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రంధ్రాలను బిగించి జిడ్డును తగ్గించడంలో సహాయపడతాయి. రంధ్రాలను బిగుతు చేస్తాయి. కలబంద.. స్వచ్చమైన కలబంద తెరుచుకున్న రంధ్రాలను తిరిగి సాధారణం చెయ్యడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జును అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కలబందలో ఉండే గుణాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి.  రంధ్రాలను బిగుతుగా ఉంచుతాయి.                                                     *నిశ్శబ్ద. 

  కళ్ల చుట్టూ నల్లని వలయాలున్నాయా? ఈ టిప్స్ పాటించి చూడండి! అమ్మాయిలను చూడగానే ఇట్టే ఆకట్టుకునేది వారి ముఖమే. ముఖంలో కూడా ఎక్కువగా కనులు ఆకర్షిస్తాయి. కానీ నేటికాలంలో జీవినశైలి, ఆహారపు అలవాట్లు, రాత్రిసమయం ఎక్కువగా మేలుకోవడం, గంటల తరబడి డెస్క్ ముందు పనిచేయడం వంటి కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటినే డార్క్ సర్కిల్స్ అని అంటారు.  వీటిని తగ్గించుకోవడానికి అధికశాతం మంది మార్కెట్లో దొరికే బ్యూటీ ఉత్పత్తులను వాడతారు. కానీ ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో అయితే కళ్ల కింద ఉన్న నల్లని వలయాలను సులువుగానే తొలగించుకోవచ్చు. కోల్డ్ కంప్రెస్.. కళ్లమీద చక్రాల్లా కోసిన కీర దోసకాయలు చల్లని స్టీలు స్పూన్లు, చల్లనీళ్లలో ముంచి తీసిన వాష్ క్లాత్ వంటివి కళ్లమీద ఉంచాలి. ఇవి కళ్ల చుట్టూ ఉబ్బిన చర్మాన్ని సాదారణంగా మారుస్తాయి. కళ్లచుట్టూ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఫలితంగా కళ్లచుట్టూ రక్తనాళాలను చురుగ్గా పనిచేస్తాయి. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి. టీ బ్యాగ్స్.. గ్రీన్ టీ ఇప్పట్లో చాలామంది వాడుతున్నారు. వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్ లో ఉంచాలి. అవి చల్లబడిన తరువాత కళ్లమీద పెట్టుకోవాలి. టీ బ్యాగ్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ కళ్ల చుట్టూ ఉన్న చర్మ రంగును మార్చడంలో సహాయపడాయి. కళ్లచుట్టూ ఉన్న చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇందుకోసం చమోమిలే లేదా గ్లీన్ టీ బ్యాగ్స్ ఉపయోగించవచ్చు. బంగాళాదుంప ముక్కలు.. కీరదోస ముక్కల్లానే బంగాళాదుంప ముక్కలను కూడా కళ్లమీద ఉంచుకోవచ్చు. బంగాళాదుంపలలో ఉండే ఎంజైమ్ లు, విటమిన్-సి వాపులను, నలుపును తగ్గిచడంలో సహాయపడుతుంది. బాదం నూనె.. రాత్రి పడుకునేముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్లచుట్టూ రాసుకుని సున్నితంగా మసాజ్ చెయ్యాలి.. బాదం నూనెలోని విటమిన్-ఇ కళ్ల కింద ఉన్న సున్నితమైన చర్మానికి పోషణ ఇచ్చి నల్లని వలయాలు  తగ్గడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్.. చాలా తేలికగా లభించేది, అన్ని రకాల బ్యూటీ ట్రీట్మెంట్లల ఉపయోగించేది రోజ్ వాటర్. రోజ్ వాటర్ అలసిన కళ్లను తిరిగి తాజాగా మార్చడంలో సహాయపడుతుంది. కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిస్తుంది. కలబంద..   మంచి నాణ్యత కలిగిన అలోవెరా జెల్ కళ్లకింద ఉన్న నలుపును పోగొట్టడంలో సహాయపడుతుంది. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. పాలు.. చల్లారిన పాలలో కాటన్ ప్యాడ్ లు ఉంచి వాటిని కాస్త పిండి తేమగా ఉన్నట్టే మూసిన కన్నులపై ఉంచుకోవాలి. సుమారు 15నిమిషాలు ఇలా ఉంచుకున్న తరువాత తీసేయాలి. పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కళ్ల చుట్టూ  ఉన్న నల్లని వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీవనశైలి ముఖ్యం.. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు నివారించడానికి లేదా తగ్గించడానికి జీవనశైలి కూడా చాలా ముఖ్యం. రోజూ తగినంత నిద్ర, పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా పొందడం, రోజూ సరిపడినంత నీరు తాగడం, తీవ్రమైన సూర్యుడి కిరణాలకు కళ్లు నేరుగా ఎక్స్పోజ్ కాకుండా చూడటం ద్వారా కళ్ల కింద నల్లని వలయాలను పరిష్కరించుకోవచ్చు.                                             *నిశ్శబ్ద.

 చలికాలంలో  ఈ ఒక్క పని చేస్తే  చర్మం  మెరిసిపోతుంది! చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, తామర, చర్మం తెల్లబడటం, చర్మం పొలుసుగా పైకి లేవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా శరీరంలో తేమ లేకపోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు తదితర సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, గోరువెచ్చని ఉప్పు నీటితో స్నానం చేయడం  చాలా సహాయపడుతుంది. రోజూ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు,  చర్మం మెరుపు సంతరించుకుంటాయి. చలికాలంలో చాలా సార్లు పరిశుభ్రత లేకపోవడం, తడి బట్టలతో ఉండటం. చలికారణంగా  శరీరంలో దద్దుర్లు, దురదలు, తామర వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి ఉప్పు సహాయపడుతుంది.  ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటికి  చర్మంపై ఉండే బ్యాక్టీరియా,  క్రిములను తొలగించే శక్తి ఉంటుంది. ఇది చర్మసంబంధ   వ్యాధులను నివారిస్తుంది. సాధారణంగా వేసవి కాలంతో పోలిస్తే శీతాకాలంలో చర్మం  మెరుపు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనికి మొదటి కారణం చలి వల్ల నీరు సరిపడినంత తీసుకోకపోవడం. శరీరంలో నీటి శాతం లోపిస్తే చర్మ సమస్యలు సులభంగా వస్తాయి. చర్మం కూడా నిర్జీవంగా మారుతుంది.  ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సమస్య అధికంగా ఉంటుంది.  గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఇది  చర్మ రంధ్రాలలో ఉండే మురికిని తొలగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీన్ని ఫాలో అయితే  అందం చెక్కుచెదరకుండా ఉంటుంది.   ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఉప్పునీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఒత్తిడిగా ఉన్నప్పుడు కండరాలు ఉద్రిక్తంగా ఉంటాయి. ఇలాంటి  పరిస్థితిలో ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు  మంచి పరిష్కారంగా మారుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది.   అలసట తొలగిపోతుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది.                                                    *నిశ్శబ్ద.