Read more!

English | Telugu

న‌లుగురికి సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న‌ సొహేల్‌!

 

బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు సొహేల్ ర్యాన్‌. హౌస్ లో ఉన్నంత కాలం 'కథ వేరే ఉంటది' అంటూ రచ్చ చేశాడు. అరియనాతో గొడవలు, అఖిల్ తో స్నేహం, టాస్క్ ల కోసం కష్టపడడం లాంటి విషయాలు సొహేల్‌ ని వార్తల్లో నిలిచేలా చేశాయి. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అత‌డి ఇమేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కి పాతిక లక్షలు వస్తే.. సొహేల్‌ కి మాత్రం నలభై లక్షల వరకు వచ్చింది. 

నాగార్జున, చిరంజీవి ఇచ్చిన చెక్కులతో సొహేల్‌ క్రేజ్ బాగా పెరిగింది. అయితే తనకు వచ్చిన ఈ మొత్తంలో ఎక్కువ శాతాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు సొహేల్‌. తాజాగా తన స్వచ్చంద సంస్థ గురించి చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. సొహేల్‌ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటివరకు చాలా సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పాడు. భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తామని అన్నాడు. 

కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్ లకు రేషన్, సరుకులు అందించబోతున్నట్లు తెలిపాడు. తమ చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి న్యూరో సర్జరీ కాగా.. మరో మూడు హార్ట్ ఆపరేషన్స్ అని.. ఇప్పటివరకు రూ. 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని వివరించాడు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉందని.. కష్టాల్లో ఉన్నవారికి తమ వంతుగా సాయం అందిస్తామని చెప్పాడు.