Read more!

English | Telugu

సీతారాములుగా దీప‌-కార్తీక్‌!.. మ‌హారాజా కుర్చీలో సీత‌!!

 

ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్‌ల‌కు 'కార్తీక దీపం' సీరియ‌ల్‌ తీసుకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. స్టార్ మాలో ప్ర‌సార‌మ‌వుతున్న ఈ సీరియ‌ల్‌కు ఉన్న ఆద‌ర‌ణ మ‌రే సీరియ‌ల్‌కూ లేదు. అది ప్ర‌సార‌మ‌వుతున్న స‌మ‌యంలో ఎంత సూప‌ర్ హిట్ సినిమాను ఏ చాన‌ల్ వేసినా దానికి టీఆర్పీ రాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన నిజం. అలాంటి సీరియ‌ల్‌లో దీప అలియాస్ వంట‌ల‌క్క‌గా ప్రేమి విశ్వ‌నాథ్‌, ఆమె భ‌ర్త డాక్ట‌ర్ కార్తీక్‌గా నిరుప‌మ్ అశేష ప్ర‌జానీకం అభిమానాన్ని చూర‌గొన్నారు.

లేటెస్ట్‌గా ఆ ఇద్ద‌రూ సీతారాముల అవ‌తారాలు ఎత్తారు. సీరియ‌ల్‌లో వారి పిల్ల‌లు శౌర్య‌, హిమ కూడా త‌మ రూపాలు మార్చుకొని ల‌వ‌కుశుల‌య్యారు. అవును. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని స్టార్ మా చాన‌ల్ 'మా ఉగాది వేడుక' పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను ప్ర‌సారం చేయ‌నున్న‌ది. ఇందులో రామాయ‌ణ గాథ‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ గాథ‌లో శ్రీ‌రామునిగా నిరుప‌మ్‌, సీతాదేవిగా ప్రేమి న‌టించారు. ఆ వేషాల్లో వారు ఆక‌ట్టుకుంటున్నారు. సీతారాముల పిల్ల‌లైన ల‌వ‌కుశులుగా శౌర్య‌, హిమ జీవించారు.

అల‌నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'ల‌వ‌కుశ‌'లోని "ఎందుకు ఈ ప‌రీక్ష‌.. ఎవ్వ‌రికీ ప‌రీక్ష‌.. శ్రీ‌రాముని భార్య‌కా శీల‌ప‌రీక్ష" అంటూ పాట వినిపిస్తుండ‌గా, ఆ పాట‌కు శోక‌త‌ప్తులుగా ల‌వ‌కుశుల వేషాల్లోని శౌర్య‌, హిమ న‌టిస్తుంటే మ‌న‌మూ శోక‌త‌ప్తులుగా మార‌తామేమో అన్న‌ట్లుగా ఉంది 55 సెక‌న్ల ప్రోమో. చివ‌ర‌లో ఏడుస్తూ, "నా ప్ర‌భువు శ్రీ‌రామ‌చంద్రుని త‌ప్ప అన్య‌మెరుగ‌ని ఇల్లాలినైతే ఓ మాతా భూమాతా.. న‌న్నాద‌రించి నీ ఒడిలో చేర్చుకో" అని సీత పాత్ర‌ధారి ప్రేమి చెప్ప‌డం, భూమాత ఆమెను త‌న‌లోప‌లికి తీసుకోవ‌డం, ల‌వ‌కుశుల‌ను శ్రీ‌రాముడు ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డం హృద‌యాల‌ను భారంగా మార్చేశాయి. 

అయితే సీత కోసం ఓ మ‌హారాజా కుర్చీ రావ‌డం, ఆమె అందులో కూర్చొని భూమి లోప‌లికి వెళ్తున్న‌ట్లు చూపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఈ ఉగాది స్పెష‌ల్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 13న స్టార్ మాలో ప్ర‌సారం కానున్న‌ది.