English | Telugu
తన తండ్రి హరికృష్ణ వల్లే క్రికెట్పై ఆసక్తి పోయిందన్న తారక్!
Updated : Sep 1, 2021
గతంలో 'బిగ్ బాస్' షోతో అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తారక్ హోస్ట్ గా మరోసారి తన మార్క్ ను చాటుకుంటున్నారు. కంటెస్టంట్స్ ను ఆయన ప్రశ్నలు అడిగే విధానం ఆకట్టుకుంటోంది. ఇక ఈ షోలో తారక్ తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. తనకు క్రికెట్ చూడాలనే ఆసక్తి పోయేలా తన తండ్రి హరికృష్ణ చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఎవరు మీలో కోటీశ్వరులు' షో తాజా ఎపిసోడ్లో తారక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ ఎపిసోడ్లో పాల్గొన్న అభిరామ్ అనే కంటెస్టంట్ కు క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, కానీ క్రికెట్ ను టీవీలో చూడటమంటే తనకు అసలు ఇష్టం లేదని తారక్ చెప్పారు. దీనికి కారణం తన తండ్రి హరికృష్ణే అని తెలిపారు. చిన్నతనంలో తన తండ్రి ఉదయం టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ ను వీసీఆర్ లో రికార్డ్ చెప్పేవారట. దీంతో ఆ మ్యాచ్ ను తను పూర్తిగా చూడాల్సి వచ్చేదని, మళ్లీ సాయంత్రం కూడా తండ్రితో కలిసి అదే మ్యాచ్ చూసేవాడినని తారక్ తెలిపారు. ఇలా చూసీ చూసీ చివరకు క్రికెట్ అంటేనే బోర్ కొట్టేసిందని తారక్ పేర్కొన్నారు.
అలాగే తన భార్య ప్రణతి గురించి కూడా తారక్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనతో పరిచయమైన 8 నెలల తర్వాత కూడా ఆమె తాను ప్రపోజ్ చేస్తే 'ఎస్' చెప్పలేదని తారక్ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. భార్యను అర్థం చేసుకున్న ఏ మగాడైనా జీవితంలో సక్సెస్ అవుతాడని ఈ సందర్భంగా తారక్ వ్యాఖ్యానించారు.