English | Telugu

‘కింగ్‌డమ్‌’ ట్రైలర్‌ లాంచ్‌పై రగడ.. అడ్డుకునేందుకు రంగం సిద్ధం?

విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘కింగ్‌డమ్‌’ ఈ నెల 31న విడుదల కాబోతోంది. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలికాలంలో హిట్‌ అనేది లేని విజయ్‌ దేవరకొండ.. ఎట్టి పరిస్థితుల్లో ‘కింగ్‌డమ్‌’ను హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో ఉన్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి భారీ ఓపెనింగ్స్‌ సాధించాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

జూలై 26న తిరుపతిలో ‘కింగ్‌డమ్‌’ ట్రైలర్‌ లాంచ్‌ జరగబోతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌కి షాక్‌ ఇచ్చాయి గిరిజన సంఘాలు. విజయ్‌ దేవరకొండ తమకు సారీ చెప్పాలని, లేకుంటే ట్రైలర్‌ లాంచ్‌ని అడ్డుకుంటామని గిరిజన నేతలు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను వారు విడుదల చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన నేతలు మాట్లాడుతూ ‘ఏప్రిల్‌ 26న నిర్వహించిన రెట్రో చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో గిరిజనులను కించపరిచేలా విజయ్‌ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, కామన్‌ సెన్స్‌ లేకుండా కొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. గిరిజనులు ప్రకృతి ప్రేమికులు. వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. సొసైటీలో బాధ్యత గల హీరో ఒక జాతిని కించపరచడం ఎంతవరకు న్యాయం? ఆయన చేసిన వ్యాఖ్యల్ని గతంలోనే ఖండిరచాం. మాకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేశాం. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా మాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఈరోజు జరగనున్న ‘కింగ్‌డమ్‌’ ట్రైలర్‌ లాంచ్‌ని అడ్డుకుంటాం’ అని గిరిజన నేతలు విజయ్‌ దేవరకొండను హెచ్చరించారు.