English | Telugu

బాలకృష్ణ అభిమానికి లివర్ మార్పిడి... వసుంధర దేవి ఏం చేసిందంటే...

నందమూరి బాలకృష్ణ తను చేసే సినిమాల ద్వారానే కాదు, కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తన తల్లి పేరు మీద స్థాపించిన బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. అంతేకాదు, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి వారికి సాయం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ సంఘటన ఆదోనిలో జరిగింది.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రి నారాయణస్వామి అనే వ్యక్తి ఎంతో కాలంగా బాలకృష్ణకు అభిమానిగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు స్వామి. అందులో భాగంగా అతనికి లివర్‌ మార్పిడి చెయ్యాలని అవసరం వచ్చింది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాదాపు 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. తన అభిమాని చికిత్స కోసం ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూశారు. బద్రి స్వామికి 10లక్షలు ఎల్‌ఓసీని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర చేతుల మీదుగా స్వామికి అందజేశారు.

బద్రి నారాయణస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడన్న విషయాన్ని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ద్వారా బాలయ్య తెలుసుకున్నారు. అభిమాని కోసం ప్రభుత్వం నుంచి సహాయం అందేందుకు కృషి చేసిన నందమూరి బాలకృష్ణను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఎల్‌ఓసీ పత్రాన్ని అందించిన వసుంధరకు, సహాయం అందేందుకు కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు నారాయణస్వామి కృతజ్ఞతలు తెలిపారు.