English | Telugu
Chiranjeevi: మెగాస్టార్ ట్రిపుల్ ట్రీట్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!
Updated : Oct 25, 2025
2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. అదే ఏడాది ఆగస్టులో వచ్చిన 'భోళా శంకర్'తో పరాజయాన్ని చూశారు. చిరంజీవి నుంచి కొత్త సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో అభిమానులు మెగాస్టార్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ గ్యాప్ ని భర్తీ చేసేలా ఇప్పుడు ఒకే ఏడాది మూడు సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు చిరు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేస్తున్నారు చిరంజీవి. 2026 సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది విడుదల కావాల్సిన 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా 2026 వేసవిలో థియేటర్లలో అడుగుపెట్టనుంది. వీటితో పాటు మరో సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది.
'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ మరోసారి చేతులు కలిపారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ లో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని 2026 చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అంటే ఒకే ఏడాది మూడు సినిమాలతో సందడి చేయబోతున్నారు చిరంజీవి. మరి ఈ సినిమాలతో ఆయన బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.