English | Telugu
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్.. ఈ గేమ్ ఎక్కడికెళ్లి ముగుస్తుందో!?
Updated : Oct 29, 2025
- సినీ కార్మికులకి 20 శాతం ఇస్తేనే టికెట్ ధరల పెంపు
- టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
- సినీ పెద్దల తక్షణ కర్తవ్యం ఏంటి?
పెరిగిన టికెట్ ధరల్లోంచి 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వడం అనే హామీ సాధ్యమయ్యే పనేనా? ఈ ప్రతిపాదన చేసిందెవరు? అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి ఎలా వచ్చిందన్న చర్చ నడుస్తోంది సినిమా ఇండస్ట్రీలో.
ఇప్పటికే నిర్మాతలు వర్సెస్ సినీ కార్మికుల మధ్య పెద్ద ఎత్తున అగాథం ఏర్పడి ఉంది. కారణమేంటంటే.. వీరు తమ తమ యూనియన్ల ద్వారా తాలు బ్యాచీనీ సినిమా ఫీల్డ్ లోకి జొప్పిస్తున్నారనీ.. ఇలాంటి నైపుణ్యంలేని కార్డు హోల్డర్ల ద్వారా షూటింగ్ స్పాట్ లో వర్కవుట్ కాక పోవడంతో తాము ముంబై టెక్నీషియన్లపై ఆధారపడాల్సి వస్తోందని.. ఒక రకంగా చెబితే ఇలాంటి యూనియన్ పాలిటిక్స్ వల్లే.. తమకు భారీగా బడ్జెట్ పెరుగోతందన్నది.. విశ్వ ప్రసాద్ వంటి నిర్మాతల మాట.
ఇదిలా ఉంటే ఇటీవల వరుసగా వస్తోన్న ఆస్కార్, ఆపై జాతీయ అవార్డులు మాలాంటి సినీ కార్మికుల వల్లే వస్తున్నాయనీ.. అలాంటి మమ్మల్ని పట్టుకుని అంతలేసి మాటలనడం సరి కాదన్నది సగటు సినీ కార్మికుడి వాదన, ఆవేదనగా తెలుస్తోంది.
అంతా బాగుంది కానీ ఇప్పటికైతే సీఎం నోటి వెంట ఒక మాట అయితే వచ్చేసింది. అదేంటంటే, మీరు పెంచే టికెట్ ధరల్లోంచి 20 శాతం మేర సినీ కార్మికులకు ఇవ్వాలని.. అలా జరిగినట్టయితే మాత్రమే మీకా ధరల పెంపు జీవోలు పాస్ చేస్తామన్నట్టు మాట్లాడారు ముఖ్యమంత్రి. అయితే ఈ సొమ్ము ఎలా ఇస్తారన్నది ఒక చర్చ కాగా.. ఇప్పటికే తడిసి మోపెడైన ఖర్చు కారణంగా దాన్నెలా రికవరీ చేసుకోవాలో తెలీక.. తామీ టికెట్ రేట్ హైక్ రూట్ ఫాలో అవుతున్నామని అంటారు సగటు నిర్మాతలు.
దీనిపై కూడా ఇప్పటికే హైకోర్టులో కేసు నమోదు వ్యవహారం నడిచింది. అదింకా ఒక కంక్లూజన్ కి రాలేదు కూడా. అయితే నిర్మాతల వర్షెన్ ఏంటంటే.. మా బడ్జెట్లు అంచనాలకు మించుతున్నాయంటారు. అయితే ఆ మొత్తం ఖర్చు లెక్కా పత్రాలు ప్రవేశ పెట్టండి అంటారు న్యాయవాదులు. ఇక్కడే ఇన్నేసి చిక్కు ముడులున్నట్టు కనిపిస్తున్నాయి. మరి వీటన్నిటినీ అధిగమించి ఈ టికెట్ రేట్ హైక్ లోంచి 20 శాతం ఎలా ఇస్తారు? ఎంతిస్తారు? అన్నదొక చర్చ.
Also Read: ఆ హీరోతో రవితేజ క్రేజీ మల్టీస్టారర్..!
బేసిగ్గా సినిమా ఎంత పెద్ద హిట్ అయినా.. కూడా నిర్మాత జేబు నిండేది అంతంత మాత్రమే. పెద్ద పెద్ద హిట్ సినిమాల ద్వారా తమకేమీ లాభాలు రాలేదని లబోదిబోమంటోన్న నిర్మాతలున్నారు. ఇటీవల అభిమాన సంఘాల వారు బిల్డప్ కోసం చెప్పుకునే కలెక్షన్ల వసూళ్ల వ్యవహారం కూడా చేటు తెస్తోంది. ఈ అనధికారిక కలెక్షన్లను చూసి ఐటీ వాళ్లు దండెత్తుతున్నారు. గేమ్ ఛేంజర్ వ్యవహారంలో ఎంత రభస జరిగిందో తెలిసిందే.
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు.. ఇప్పుడీ ఇరవ శాతం వాటా ఇవ్వడం అంటే అదెలాగో అర్ధం కాక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు నిర్మాతలు. టికెట్ హైక్ ద్వారా అన్ని సినిమాలకూ లాభాలు వచ్చేయవు.. అవి జస్ట్ ఒక ఊరట లాంటివి మాత్రమే అన్నది నిర్మాతలంటోన్న మాట. ఈ మధ్య కాలంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఈ ప్రీమియం షోలకు పొలోమని తరలి రావడం కూడా బాగా తగ్గింది. వంద రోజులు, యాభై రోజుల పాటు ఆడ్డం అనే పరంపర ఎటూ లేదు కాబట్టి అదొక మైనస్.
ఒక వేళ ఒక సినిమా వారం పాటు అది కూడా యావరేజ్ టాక్ తో ఆడితే.. ఆడినట్టు.. డబ్బులు వస్తే వచ్చినట్టు.. ఈ టికెట్ హైక్ ద్వారా అలాగైనా కొంత నష్టం కవర్ అవుతుందేమో అని ఆశించే నిర్మాత ఆశలపై ఈ 20 శాతం నిర్ణయం నీళ్లు కుమ్మరించిందా? ఈ విషయంపై నిర్మాతల మండలి స్పందనేంటన్నది ఇంకా తెలియ రాలేదు. ఇప్పటికైతే వారు తమ ఫిలిం ఛాంబర్ ని కాపాడుకునే పోరాటంలో ఉన్నట్టుంది చూస్తుంటే.. త్వరలో దీనిపై ఒక క్లారిటీ అయితే రావల్సి ఉంది.
ఇంతకీ ఈ 20 శాతం ఎలా ఇవ్వాలి? అని చూస్తే ఒక సినిమా టికెట్ ధర వెయ్యి రూపాయలకు పెంచుకోడానికి జీవో పాస్ అయ్యిందంటే.. అందులోంచి 200 రూపాయలు సినీ కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఆయా కార్మిక సంఘాలన్నీ ఏకమై ఒక అకౌంట్ ఇస్తే అందులోకి దీన్ని జమ చేయాల్సి రావచ్చు. మరి దీన్ని ఎలా ప్లాన్ చేస్తారో ఇంకా ఒక రూట్ మ్యాప్ అయితే రాలేదు. ఒక వేళ ఇదంతా కలసి ఒక పెద్ద మొత్తం తయారైతే దాన్ని దేనికి ఖర్చు చేయాలన్నది తర్వాతి స్థాయి చర్చ. మరి చూడాలి.. ఈ ట్వంటీ- ట్వంటీ సినీ గేమ్ ఎక్కడికెళ్లి ముగుస్తుందో తేలాల్సి ఉంది.