English | Telugu
ఒక్కడి వల్ల టాలీవుడ్ కి వేల కోట్ల నష్టం!
Updated : Jul 3, 2025
సినీ పరిశ్రమకు పైరసీ అనేది శాపం లాంటిది. ఓ వైపు ఓటీటీల పుణ్యమా అని థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. పైరసీ అనేది అంతకు మించి ఎన్నో రెట్ల ప్రభావాన్ని చూపుతుంది. సినిమా విడుదలైన రోజే హెచ్డీ క్వాలిటీ ప్రింట్ లు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. దాంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడి.. నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా కేవలం ఓ వ్యక్తి కారణంగానే ఏకంగా రూ.3000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
పైరసీ కేసులో ఇటీవల కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిరణ్ 2019 నుంచి ఇప్పటివరకు 65 కి పైగా సినిమాలను పైరసీ చేసినట్లు తెలుస్తోంది. అలా పైరసీ చేసిన సినిమాలను పలు సైట్లకు అమ్మాడట. ఒక్కో సినిమాకి రూ.80 వేల దాకా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఈ మొత్తం సినిమాల విలువ మూడు వేల కోట్లకు పైగా ఉంటుంది అంటున్నారు. ఇటీవల సింగిల్ మూవీని కూడా పైరసీ చేయగా.. యాంటీ పైరసీ సెల్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు.