English | Telugu

నాకు యాక్షన్ ఇష్టం.. 40 అడుగుల ఎత్తులో!

త్రిగుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి. ఆర్ట్స్ పతాకంపై చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మించిన సినిమా 'కథ కంచికి మనం ఇంటికి'. ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన పూజితా పొన్నాడ 'కథ కంచికి మనం ఇంటికి' సినిమాతో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల గురించి పలు విషయాలు పంచుకుంది.

పూజితా పొన్నాడ మాట్లాడుతూ.. "ఈ ఏడాది విడుదలవుతున్న నా తొలి సినిమా 'కథ కంచికి మనం ఇంటికి'. హారర్ నేపథ్యంలో రూపొందిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇందులో దీక్ష అనే పాత్ర చేశా. తనకు బెట్టింగ్ అంటే ఇష్టం. ప్రతిసారీ బెట్ గెలుస్తుంది. ఆ డబ్బును ఛారిటీ చేస్తుంది. బెగ్గర్స్ కోసం ఇస్తుంది. ఇటువంటి పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా, ఆస‌క్తిక‌రంగా అనిపించింది. రచయితగా 'మిర్చి' హేమంత్, దొంగగా 'గెటప్' శీను చేశారు. హీరో హీరోయిన్లతో పాటు వీళ్ళ పాత్రలు కూడా సినిమాలో కీలకం. ఫస్టాఫ్ అంతా సరదాగా ఉంటుంది. సెకండాఫ్ హారర్ జోనర్ లో ఉంటుంది. అక్కడ కూడా ఫన్ మిస్ అవ్వదు."

"ఈ సినిమాలో నాకు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఎంత మంది హీరోయిన్లకు యాక్షన్ చేసే ఛాన్స్ వస్తుంది చెప్పండి? దర్శకుడు కథ వివరించినప్పుడు 40 అడుగుల ఎత్తులో మీరు యాక్షన్ చేయాలని చెప్పారు. నాకు యాక్షన్ చేయడం అంటే ఇష్టమని చెప్పాను. ఫస్ట్ ఫ్లిఫ్స్ చేసినప్పుడు నా ముఖానికి దెబ్బలు తగులుతాయేమోనని భయపడ్డా. రెండు మూడు రిహార్సిల్స్ చేసిన తర్వాత ఈజీగా చేశా. ఫైట్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఇంకా యాక్షన్ సీన్స్ పెట్టమని అడిగా. సెకండాఫ్ లో ఒక యాక్షన్ సీన్ ఆడియన్స్ కు స‌ర్‌ప్రైజ్‌ ఇస్తుంది" అని తెలిపింది.

అలాగే, ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ.. "తెలుగులో రవితేజ గారితో 'రావణాసుర', పవన్ కళ్యాణ్ గారితో 'హరిహర వీరమల్లు', 'ఆకాశ వీధిలో', 'జోరుగా హుషారుగా', 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ కోసం ఒక యాంథాలజీ చేస్తున్నాను. ఈ ఏడాది నేను తమిళ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాను. ఆరితో 'భగవాన్', శ్రీరామ్ గారితో 'ట్రైనర్' సినిమాలు చేస్తున్నాను. గాళ్ నెక్స్ట్ డోర్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తున్నాను" అని పూజిత పొన్నాడ చెప్పుకొచ్చింది.