English | Telugu

ఇదే స్ఫూర్తితో ప‌నిచేయండి! సీఎం చర్యలు బాగున్నాయన్న ఉప రాష్ట్రపతి!

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలిన తదనంతర పరిస్థితులపై భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫోన్ చేసిన ఉప రాష్ట్రపతి రాష్ట్రంలోని రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పేద ప్రజలు, వలస కార్మికులకు ప్రభుత్వపరంగా, దాతలను ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటం, అవసరమైన చోట భోజన వసతి కల్పిస్తున్న విషయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి వినోద్ కుమార్ తీసుకొచ్చారు. కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని వినోద్ కుమార్ ఉప రాష్ట్రపతి కి వివరించారు. లాక్ డౌన్ ను కూడా పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు బాగానే ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వినోద్ కుమార్ కు తెలిపారు. కరోనా వైరస్ ను తుదముట్టించే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉప రాష్ట్రపతి సూచించారు.