English | Telugu
కాంగ్రెస్, బీజేపీల్లో లీకు వీరులు.. హరీష్, కేటీఆర్ కు చేరుతున్న కీలక సమాచారం!
Updated : Dec 16, 2025
తెలంగాణ పారిశ్రామిక విధానంపై రేవంత్ సర్కార్ ఇలా అనుకుందో లేదో.. అది విషయం అలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కి చేరిపోయింది. ఇవేం లీకులురా బాబూ అంటే రేవంత్ సర్కార్ ఒక్కసారి ఉలిక్కి పడింది. ప్రభుత్వ అధికార గణంలో.. మరీ ముఖ్యంగా సచివాలయంలో కేటీఆర్ కి ఇంత నెట్ వర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
అలాగే మైనంపల్లి హనుమంతరావు చేసిన కోవర్ట్ కామెంట్ కూడా బీఆర్ఎస్ కు పార్టీలో ఉన్న లీకు వీరుల సంగతిని ప్రస్ఫుటం చేసింది. ఇంతకీ మైనంపాటి ఏమన్నారంటే.. రాష్ట్రం సంగతేమో తెలీదు కానీ, మెదక్, సిద్ధిపేట పరిసరప్రాంతాలలో హరీష్ రావు ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉందనీ, ఒక మాట మన నోటి నుంచి ఇలా వచ్చిందో లేదో.. అలా హరీష్ కు చేరిపోతుందని బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల్లోనూ హరిష్ ఫాలోయర్స్, మద్దతు దారులు బలంగా ఉన్నారన్న అభిప్రాయమూ కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది. దీనిపై కూడా మైనంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవర్ట్ నెట్ వర్క్ నడుపుతున్నా, ఎప్పటికప్పుడు కాంగ్రెస్ లీడర్లు, ఇతర ప్రభుత్వ సమాచారం వారికి చేరిపోతున్నా.. ప్రజలు మాకు పట్టం కట్టి గెలిపిస్తున్నారన్నారు మైనంపల్లి. అయితే ప్రభుత్వ సమాచారం ప్రతిపక్షానికి లీక్ కావడమన్నది ఎంత కాదనుకున్నా ఇబ్బందేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
అయితే ఆ లీకులు ఒక్క రేవంత్ సర్కార్ కే పరిమితం కాలేదనీ, రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీలోనూ ఉన్నాయనీ వెల్లడైంది. కమలం పార్టీలోనూ లీకు వీరులున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో తమ భేటీ లో ని అంశాలన్నీ లీకయ్యయని కిషన్ రెడ్డి లబోదిబో మన్నారు. ఇలా లీకులు చేసే వారు మెంటల్ గాళ్లంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో మీకన్నా అసదుద్దీన్ ఓవైసీ నయం అన్నారు. ఆ మాట బయటకు వచ్చేసింది. మోడీ అక్షింతలతో రాష్ట్ర బీజేపీ నేతల పరువు సగం పోయింది. మోడీ వ్యాఖ్యలు లీక్ అయ్యి బయటకు రావడం, ఆ లీకు వీరుల పని పడతామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చెప్పక తప్పని పరిస్థితి రావడంతో రాష్ట్ర బీజేపీ పరువు పూర్తిగా పోయినట్లైంది.మొత్తం మీద అధికారంలో లేకున్నా ట్యాపింగ్ వంటి దారులలో సమాచార సేకరణ చేయడానికి వీల్లేకున్నా కూడా హరీష్, కేటీఆర్ కి చేరాల్సిన సమాచారమైతే చేరిపోతోందనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు.