బాబు–పవన్ బంధమే వైసీపీకి బ్రేకా..సర్వేలో సంచలన సంకేతాలు..!
Publish Date:Jul 3, 2026
Advertisement
సొంత సర్వేతోనే జగన్కు షాక్?.. ‘మావిగన్’ వ్యూహంపై పార్టీలో అసంతృప్తి..? నెల్లూరు కాంట్రాక్టర్ కార్యాలయంలో వైసీపీ సర్వే బృందం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు "మావిగన్" నినాదం ఉపయోగపడుతుందంటూ తెలంగాణకు చెందిన ఓ మేధావి సూచించారనే ప్రచారం కూడా సాగుతోంది. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహం ఫలితం ఏమిటో అర్థంకాక పలువురు నేతలు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. "మావిగన్" అనే నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతినే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో మరోసారి రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. పార్టీ తరఫున సర్వేలు నిర్వహించే బాధ్యతను ఇద్దరు మాజీ అధికారులకు అప్పగించినట్లు సమాచారం. వీరు తరచూ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి–మైండ్స్పేస్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆ కార్యాలయంలోనే సర్వే బృందానికి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది. గతంలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పార్టీ సర్వేల వ్యవహారాన్ని పర్యవేక్షించేవారని, అయితే ఆ సర్వేలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ బాధ్యతను నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్–రాజకీయ నాయకుడికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వే ఫలితాలు పార్టీ అధినేతను తీవ్ర నిరాశకు గురిచేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ సమన్వయం బలంగా కొనసాగుతున్నంతకాలం వైసీపీకి అధికార అవకాశాలు పరిమితంగానే ఉంటాయని సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే కొత్త రాజకీయ నినాదాలు, వ్యూహాలపై పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జమీన్ రైతు పత్రిక ప్రత్యేక కథనం..!
http://www.teluguone.com/news/content/ysrcp-survey-36-224976.html





