వైసీపీ నేతల కాషాయ జపం.. జగన్ స్టాండ్ మారుతోందా?
Publish Date:May 21, 2025
Advertisement
ఆంధ్రాలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీలో నేతల అంతర్గత విశ్లేషణల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వై నాట్ 175 అంటూ హడావుడి చేసిన జగన్ పార్టీని ప్రజలు ఛీత్కరించారు. దాంతో పార్టీ ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ నాయకుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైఎస్ జగన్ చేసిన పెద్ద తప్పని నల్లపురెడ్డి కుండబద్దలు కొట్టేశారు. మనసులో మాటని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే నేతగా పేరున్న నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చిన నల్లపురెడ్డి, ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. దాంతోఈ వ్యవహారంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోందట. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ లోక్సభ, రాజ్యసభల్లో సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా వైసీపీ మద్దతిచ్చినట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. గడిచిన ఐదేళ్లు పార్లమెంట్లో కేంద్రానికి అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీకి దూరమైంది. 2024 ఎన్నికల సమయంలోనూ బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అండగా నిలిచిన వైసీపీ, ఎన్నికల్లోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తప్పు ఏముందనే చర్చ కూడా నడిచింది. అయితే పొత్తు విషయంలో వైసీపీ వైపు నుంచి అడుగులు పడకపోవడంతో బీజేపీ చివరకు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందంటున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ పెద్దలు కూడా బీజేపీతో ఢిల్లీ స్థాయిలో సత్సంబంధాలు కొనసాగించారు. ఎప్పుడూ బీజేపీ విధానాలను కానీ.. ఆ పార్టీ పెద్దలపై కానీ ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీపై విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల గడువుంది. ఉన్నట్టుండి.. బీజేపీతో పొత్తు అంశాన్ని ఇప్పుడెందుకు తెరపైకి తీసుకొచ్చారు? అనే చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్య నేతలు తరచుగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా, ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బీజేపీ బయటకు వచ్చే పరిస్ధితులు లేవు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన బంధం మరింత బలపడింది. ఈ తరుణంలో వైసీపీ నేతలు బీజేపీతో పొత్తు అంశాన్ని మాట్లాడటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఒంటరిగా ఎన్నికలకు వెళితే వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని గ్రహించే ఆ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్పై పార్టీ స్టాండ్ ఎంటనేది ఇంకా ప్రకటించినప్పటికీ, ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసే, బీజేపీతో కలిసి వెళితే లాభం ఉంటుందని ఆయన మాట్లాడి ఉంటారని, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు అంటున్నారు. అయితే.. వైసీపీతో కలవాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సింది మాత్రం కేంద్ర నాయకత్వమే అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ మాత్రం ఓ అడుగు ముందుకేసి బీజేపీ, వైసీపీ ఉత్తర, దక్షిణ ధృవాలని, భవిష్యత్లో అవి కలిసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/ycp-leaders-saffron-chant-39-198396.html





