చంద్రగిరిలో వైసీపీ నేతల అరాచకం.. ఇంతకు ఈవీఎంలు భద్రమేనా! ?
Publish Date:May 14, 2024
Advertisement
వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఓటమి భయంతో ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నాయి. ఏకంగా తెలుగుదేశం అభ్యర్థులపైనే హత్యాయత్నానికి పాల్పడుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా పోలింగ్ ముందు, పోలింగ్ రోజున ఘర్షణలు జరగడం చూస్తుంటాం. కానీ, చంద్రగిరి నియోజకవర్గంతో పాటు పలు నియోకవర్గాల్లో వైసీపీ నేతలు పోలింగ్ తరువాత రోజుకూడా దాడులకు తెగబడ్డారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దీంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేయగా.. వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు.పోలింగ్ రోజు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు పెద్దెత్తున ఓటర్లపై బెదిరింపులకు పాల్పడంతోపాటు, పలు పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు చేశారు. అయినా, వారిని ఓటమి భయం వెంటాడుతుండటంతో ఏకంగా తెలుగుదేశం అభ్యర్థిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక పక్క పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించే క్రమంలో అధికారులు తెలుగుదేశం నేతలకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్ట్రాంగ్ రూంల వద్ద అధికారుల సహకారంతో ఈవీఎంలలో ఏమైనా మతలబు జరిగిందా అనే అనుమానాన్ని తెలుగుదేశం నేతలు వ్యక్తం చేస్తుండగా.. పులివర్తి నానిపైనే హత్యాయత్నం చేయడం, ఆయన గన్ మెన్ ను తీవ్రంగా గాయపర్చడం ఏపీలో సంచలనంగా మారింది. నాని వాహనంపై దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో చంద్రగిరి నియోజకవర్గం ఏమైనా ఆఫ్గనిస్థాన్ దేశంలో ఉందా అనే అనుమానం కలగక మానదు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెంచి పోషించిన గూండాలు పక్కా ప్లాన్ ప్రకారమే హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఈవీఎంలను తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చారు. మంగళవారం(మే5) సాయంత్రం స్ట్రాంగ్ రూంలో ఈవీఎంల పరిశీలనకు పులివర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం నేతలు యూనివర్శిటీకి వెళ్తున్నారు. యూనివర్శిటీ లోపలికి ఎంటర్ కాగానే నాని కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. ఆయన వెనుకాలేఉన్న సుధారెడ్డి వాహనం సైడ్ తీసుకొని యూనివర్శిటీ లోపలికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న వైసీపీ గూండాలు రాడ్లు, పెద్ద సుత్తి, బీరు సీసాలతో నాని కారుపై దాడికి తెగబడ్డారు. ఊహించని పరిణామంతో కొద్దిసేపు నాని, ఆయన గన్ మెన్, టీడీపీ నేతలు కారులో ఉండిపోయారు. దీంతో వైసీపీ గూండాలు రాడ్డులు, బీర్ బాటిల్స్ తో దాడిని ఉధృతం చేశారు. నాని ఉన్న కారు అద్దాలను రాడ్లతో పగలగొట్టి హత్యాయత్నం చేశారు. గన్మెన్స్ అప్రమత్తమై నాని ని కారుదింపి అక్కడి నుంచి పంపించి వేశారు. నాని వెళ్తుండటంతో అతనిపై కొంతమంది వైసీపీ నేతలు దాడికి యత్నించగా.. గన్మెన్ అడ్డుకున్నాడు. వైసీపీ జడ్పీటీసీ పెద్ద సుత్తి (సమ్మెట) తో గన్ మెన్ పై దాడి చేశాడు. ఈ దాడిలో నానితోపాటు గన్ మెన్కు, పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కారు డాష్ బోర్డుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో ఆ దృశ్యాలను చూసిన ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ గూండాల దాడుల వెనక పెద్దప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ఈవీఎంలను స్ట్రాంగ్ తరలించేటప్పుడు తమకు సమాచారం లేదని, సీల్ కూడా వేయలేదని పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. స్టాంగ్ రూంల పరిశీలనకు వైసీపీ అభ్యర్థి తెలుగుదేశం నేతల కంటే ముందే వెళ్లినట్లు తెలిసింది. దీన్నిబట్టిచూస్తే ప్లాన్ లో భాగంగానే వైసీపీ నేతలు పులివర్తి నాని వాహనాలపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అభ్యర్థి వస్తున్నట్లు ముందుగానే సమాచారం అందుకున్న వైసీపీ గూండాలు దాడికి చేసేందుకు కాపుకాసుకొని ఉన్నారు. వీరిని స్టాంగ్ రూంల వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలని ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం దాడులకు పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, వైసీపీ గూండాల దాడికంటే ముందే సుధారెడ్డి స్ట్రాంగ్ రూంల వద్దకు చేరుకున్నారు. పులివర్తి నానిపై దాడి అనంతరం సుధారెడ్డి మాట్లాడుతూ.. కొన్ని ఈవీఎంలకు సీల్ వేయకుండానే, తమకు సమాచారం లేకుండానే స్ట్రాంగ్ రూంలకు తరలించినట్లు ఆరోపించారు. పోలింగ్ సమయం నుంచే కొన్ని పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలో మతలబు జరిగినట్లు తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ముందుగావేసుకున్న ప్లాన్ ప్రకారమే యూనివర్శిటీ ఎంట్రన్స్ లో వైసీపీ గూండాలు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే, కార్ డాష్ బోర్డులకు ముందుగానే తెలుగుదేశం అభ్యర్థి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో వైసీపీ గుండాల అరాచకం వెలుగులోకి వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెంచిపోషించిన వైసీపీ గూండాలు పోలీసులపైనా దాడులకు తెబడ్డారు. పోలింగ్ రోజు ఓ సీఐను గాయపర్చారు. అయినా పోలీసుల్లో చలనం లేకపోవటం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసీపీ నేతలు కాకుండా ఇతర పార్టీల నేతలు పోలీసులపై చేయి ఎత్తితేనే పెద్దరాద్దాంతం చేసే ఏపీ పోలీసులు వైసీపీ గూండాలు ఏకంగా దాడులు చేసినా కిక్కురుమనకుండా పడిఉండటం విస్మయం కలిగిస్తోంది. స్ట్రాంగ్ రూంలు భద్రపర్చిన యూనివర్శిటీ లోపల టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడిన విషయంపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించామని, తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఈవీఎంలు భద్రపర్చిన పద్మావతి మహిళా యూనివర్శిటీ ఎంట్రెన్స్ లోనే టీడీపీ అభ్యర్థిపై బీరు బాటిళ్లు, పెద్ద సుత్తి, రాడ్లతో దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నకు ఎస్పీ నుంచి సమాధానం రాలేదు. అసలు గేటు ఎంట్రీ వద్ద భద్రత ఉండదా అని విలేకరుల ప్రశ్నించగా.. ఎస్పీ సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. స్ట్రాంగ్ రూంలు సేఫ్.. అక్కడ భద్రత ఏర్పాటు చేశాం అంటూ విలేకరుల ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ నేతలు, పోలీసుల వ్యవహారం చూస్తుంటే.. దాడుల పేరుతో టీడీపీ నేతలు, ప్రజలను డ్రైవర్ట్ చేసి.. ఈవీఎంలలో మతలబు విషయాన్ని వెలుగులోకి రాకుండా చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గూండా బ్యాచ్ ప్లాన్ చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం నేతలు, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న.. ఈవీఎంలు సేఫేనా అని. ఈవీఎంలు తరలించే సమయంలో, స్ట్రాంగ్ రూంలో భద్రపర్చే సమయంలో ఏం జరిగిందనే విషయం అధికారులకు, వైసీపీ నేతలకు, ఆ దేవుడికే తెలియాలి మరి. మొత్తానికి ఎలాగోలా మోహిత్ రెడ్డిని గెలిపించుకోవాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గూండా బ్యాచ్ చేస్తున్న అరాచకం చూస్తుంటే చంద్రగిరి నియోజకవర్గం భారతదేశంలోనే ఉందా? అన్న అనుమానం కలగక మానదు.
http://www.teluguone.com/news/content/ycp-anarchy-in-chandragiri-39-175990.html