హస్తం చేతికి మూడవ రాష్ట్రం
Publish Date:Dec 8, 2022
Advertisement
గుజరాత్ లో బీజేపీ ఎంత ఘన విజయం సాధించినా... ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్. అధ్బుత విజయం సొంతం చేసుకున్నా.. అటు గుజరాత్ లో ఇటు ఢిల్లీలో కాంగ్రెస్, చారిత్రక ఓటమిని సొంతం చేసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ విజయం సాధించింది. వరస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే విజయంగా దీనిని పేర్కొంటున్నారు. ఇంకా అంతిమ ఫలితాలు రావలసి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ విజయం ఖరారైంది. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. కాంగ్రెస్ పార్టీ, మేజిక్ ఫిగర్ దాటి ఒకటి రెండు స్థాలు అటూ ఇటుగా 40 స్థానాలను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో వంక బీజేపీ ట్యాలీ 25 దగ్గరే ఆగిపోయింది. సో ... ఇక కనీసం ప్రస్తుతానికి ఆకర్ష్, వికర్ష్’లకు కూడా అవకాశం లేదని తేలిపోయింది. నిజమే. హిమాచల్ ప్రదేశ్ లో గత 30-40 ఏళ్లలో అధికార పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. ఒకసారి బీజేపే, మరోసారి కాంగ్రెస్ ఇలా వంతుల వారీగా హిమాచల్ ఓటర్లు రెండు పార్టీలను మార్చి, మార్చి గద్దె నెక్కిస్తున్నారు. ఇప్పడు కూడా అదే జరిగిందని బీజేపీ అనుకోవచ్చును కానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ విజయం అపూర్వం. కారణం ఏదైనా ఒక విధంగా ఓటమికి అలవాటు పడిపోయిన పార్టీని అనుకోకుండా విజయం వరించింది. అలాగే కాంగ్రెస్ పగ్గాలు గాంధీల చేతి నుంచి ఖర్గే చేతికి చిక్కిన తర్వాత సాధించి తొలి విజయంగానూ కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ విజయం కొంతకొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రంలో, ఖర్గే విజయం సాధించారు. ఆవిధంగాను హిమాచల్ గెలుపు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపుతుందని అంటున్నారు. ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల తర్వాత, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒకరు ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. గత లోక్ సభ ఎన్నికలకు ముందు, 1918 లో జరిగిన మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మధ్య ప్రదేశ్ చేజారిందనుకోండి అది వేరే విషయం. ఆ తర్వాత 2019 లోక్ సభఎన్నికల ఓటమి తర్వాత 15కు పైగా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను చేజార్చుకోవడమే కానీ, ఒక్క రాష్ట్రంలోనూ, అధికారం నిలుపుకోలేదు. కొత్తగా అధికారంలోకి రాలేదు. సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్య పక్షంగా మంత్రి పదవులకు మాత్రమే పరిమితం అయింది. ముఖ్యమంత్రి పీఠం మాత్రం హస్తం పార్టీ చేతికి చిక్కలేదు. అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. ఇంత కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం చిక్కింది. ఇంతవరకు కేవలం, రెండే రాష్ట్రాలకు పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మూడో రాష్ట్రం వచ్చి చేరింది. అందుకే, గుజరాత్ లో బీజేపీ, ఢిల్లీలో ఆప్ సాధించిన విజయం కంటే, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమే ... ప్రస్తుత ఎన్నికల్ రౌండ్ లో హై లైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/win-in-himachal-pradesh-brings-power-in-third-state-to-congress-39-148250.html