కోమటిరెడ్డి రాజగోపాల్ మళ్లీ ఝలక్ ఇస్తారా?
Publish Date:Jun 11, 2025

Advertisement
మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర నిరాశ లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఇటీవల జరిగింది. అది కూడా పాక్షికంగానే. తెలంగాణ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది. అయితే ఈ విస్తరణలో తనకు చోటు దక్కక పోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనస్తాపం చెందారట. ఇప్పటికే మంత్రి పదవి హామీతో కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల విషయంలో హైకమాండ్ ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది.
బీజేపీలోకి వెళ్లి తిరిగొచ్చిన గడ్డం వివేక్ వెంకటస్వామికి కూడా తాజా విస్తరణలో క్యాబినెట్ బెర్త్ లభించింది. అయితే తనకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందని రాజగోపాల్ మధన పడుతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తిరిగి పార్టీలోకి రావాలని, మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ ఎన్నికల ముందుఆయనకు హామీ ఇచ్చిందంట. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ని గెలిపిస్తే పదవి ఇస్తామని రెండోసారి హామీ ఇచ్చిందంట. ఆ హామీ నెరవేర్చలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పుకుండా బెర్త్ దక్కుతుందని భావించిన రాజగోపాల్ రెడ్డి కి మంత్రి దక్కకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునే పనిలో ఉన్నారట.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి దక్కక పోవడానికి ప్రధాన కారణం ఆయన సోదరుడు వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉండటమే అంటున్నారు. అదీకాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్డి నేతలు మంత్రులుగా ఉండటంతో రాజగోపాల్ కు కుల సమీకరణలు కలిసిరాలేదంటున్నారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. దీంతో మళ్లీ ఇంకో రెడ్డి సామజిక వర్గం నేతకే పదవి ఇస్తే ఒక్క జిల్లా నుంచే ముగ్గురవుతారని.. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే నెగటివ్ అవుతుందనే హైకమాండ్ ఆయన విషయాన్ని పెండింగ్ లో పెట్టిందంటున్నారు.
రాజగోపాల్కు ఇచ్చిన హామీని ఎలా నెరవేర్చాలో? అయన్ని ఎలా సంతృప్తి పరచాలో అంతుపట్టక పార్టీ పెద్దలు సతమతమవుతున్నారంట. అందుకే పొంగులేటి , వివేక్ కి ఇచ్చిన హామీ నెరవేర్చినా రాజగోపాల్ రెడ్డి విషయం లో స్పష్టత కొరవడిందంట. వివేక్ కుమారుడు ఎంపీగా ఉన్నా, ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అదే ఎంపీగా తన భార్య లక్ష్మిని పోటీకి దింపకుండా చామల బరిలో దిగితే సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినా తనకు మంత్రి పదవి రాకుండా జిల్లా నేతలే అడ్డుకుంటున్నారని రాజగోపాల్రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు.
రెండు నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. దాంతో రాజగోపాల్రెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. జానారెడ్డి లేఖతో మంత్రి పదవి రాకుండా పోయిందని ధర్మరాజు లా ఉండాల్సిన వారు దృతరాష్టుడిలా మారారని అప్పట్లో రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరవాత ఆవేశంతో పని కాదని జిల్లా మంత్రులు ఉత్తమ్ , కోమటిరెడ్డిలతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. కాని మంత్రి పదవి రాకపోవడంతో మళ్లీ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఫామ్ హౌస్కే పరిమితమై సైలెంట్ అయ్యారు.
రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉండటం తో ఎం చేయబోతున్నారనే సస్పెన్స్ నెలకొంది . ఇప్పటికే సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు . మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నిస్తూ.. రాజగోపాల్కి మంత్రి రాలేదన్న అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు . ఇంత జరుగుతున్నా రాజగోపాల్ తన మనసులో మాట బయటపెట్టడం లేదు. సామాజిక కోణంలో అధిష్టానం మూడు స్థానాలు భర్తీ చేసిందని, ఇంకా మూడు పోస్టులు ఖాళీగా ఉండటంతో అన్ని విధాలా ఆలోచన చేసి మళ్లీ విస్తరణలో నిర్ణయం తీసుకుంటుందని ఇంచార్జ్ మీనాక్షి చెప్పడంతో కొంత కాలం వెయిట్ చేద్దామని రాజగోపాల్ భావిస్తున్నారంట.
అయితే తమ నాయకుడు ఇక ఎంతో కాలం వేచి చూసే పరిస్థితి లేదని కోమటిరెడ్డి అనుచరులు అంటున్నారు . ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరోసారి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంట. ఇప్పుడే రాజీనామాపై నిర్ణయం వెల్లడిస్తే పార్టీని బ్లాక్ మెయిల్ చేసినట్లు అవుతుందని వెయిట్ చేస్తున్నారంట. మరి చూడాలి ఆ సస్పెన్స్కు ఎప్పుడు తెర పడుతుందో.
http://www.teluguone.com/news/content/will-rajgopalreddy-give-shock-to-congress-39-199712.html












