హర్మూజ్ ను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Publish Date:Apr 17, 2026
Advertisement
హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు ధ్యాంక్స్ కూడా చెప్పారు. ప్రపంచం మొత్తం ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేసింది. అయినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇసుమంతైనా సడలినట్లు కనిపించడంలేదు. హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హర్మూజ్పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ సామాజిక మాధ్యమ వేదికలో నిర్ణీత మార్గంలో, ఇరాన్ అనుమతితో మాత్రమే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణాలు సాగుతాయని పేర్కొన్నారు. అమెరికా దిగ్బంధనం కొనసాగితే జలసంధి మూసేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అబద్ధాలతో అమెరికా యుద్ధం గెలవలేదని ఎద్దేవా చేశారు. జలసంధి తెరిచి ఉంటుందా? లేదా మూసి ఉంటుందా? అనే విషయాన్ని క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయని, సోషల్ మీడియా కాదని ఘలీబాఫ్ ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు లెబనాన్లో కాల్పుల విరమణ కొనసాగుతున్నంత కాలం వాణిజ్య నౌకల రాకపోకలకు హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. ఇరాన్తో తమ 'లావాదేవీ' పూర్తయ్యే వరకు నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని, అయితే ఈ ప్రక్రియ చాలా త్వరగా ముగుస్తుందని అన్నారు. దీనిపైనే.. ఘలీబాఫ్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ ను ఓపెన్ చేసినప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించడానికి వాణిజ్య నౌకా సంస్థలు వెనుకాడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/will-close-the-strait-of-hormuz-36-217634.html





