కాక్రోచ్ జనతాపార్టీతో జరిగేదేంటి? ఒరిగేదేంటి?
Publish Date:May 28, 2026
Advertisement
భారతదేశ రాజకీయాల్లో, సోషల్ మీడియా వేదికల్లో ఈ మధ్య కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మార్మోగిపోతున్నది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. రోజురోజుకీ ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అసలు ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం ఒక బాహ్య లక్షణం మాత్రమే.. దీని వెనుక చాలా లోతైన, మౌలికమైన వ్యవస్థాపక సమస్యలు ఉన్నాయి. ఇండియాను చాలా సంవత్సరాలుగా ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న నిరుద్యోగం, క్రోనీ క్యాపిటలిజం, విపరీతమైన పన్నుల విధానాల వల్ల నేటి యువతలో ఉన్న తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, నిస్తేజం, నిరుత్సాహానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇదొక వ్యంగ్యాస్త్రం లాంటిది. అంతే తప్ప వ్యవస్థీకృత రాజకీయ ఉద్యమం కాదని నల్లమోతు చక్రవర్తి అన్నారు. నేడు దేశంలో యువతకు కావాల్సింది గౌరవప్రదమైన ఉపాధి, మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు. మన పక్కనే ఉన్న చిన్న దేశాలు అనూహ్యమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తుంటే.. భారతదేశం మాత్రం వెనకబడిపోతోందన్న బాధ యువతను వేధిస్తోంది. చైనా మనకంటే 5 నుంచి 6 రెట్లు ఆర్థికంగా ఎదిగింది, దక్షిణ కొరియా జపాన్ కంటే సంపన్న దేశంగా మారింది. తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాలు అద్భుతమైన అభివృద్ధిని కనబరుస్తున్నాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తి ఉన్న ఇండియా మాత్రం వెనుకబడిపోయింది. యువశక్తిని సరిగా ఉపయోగించుకోవడంలో ఇండియా రాజకీయ నాయకులు, పాలకులు, సమాజం విఫలమేనని చెప్పక తప్పదని నల్లమోతు అన్నారు. ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో 5 లేదా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అవుతున్నప్పటికీ.. సగటు తలసరి ఆదాయం విషయానికి వస్తే మనం ప్రపంచంలో 140వ స్థానంలో ఉన్నామనే చేదు నిజం , మన ఆర్థిక విధానాల వైఫల్యానికి అద్దం పడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు, అలాగే ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాలు. దేశంలో బ్యాంకుల దగ్గర ఉన్న మొత్తం ధనం దాదాపు 640 లక్షల కోట్లు. ఈ డబ్బే దేశంలో కొత్త పరిశ్రమల స్థాపనకు, ఉపాధి కల్పనకు పెట్టుబడిగా మారాలి. కానీ.. మన ప్రభుత్వాలు దాదాపు 300 లక్షల కోట్లను వివిధ రకాల ఉచిత పథకాలకు, ఉచిత బస్సు ప్రయాణాలకు, ఉచిత సిలిండర్లకు, అవినీతిమయమైన ప్రాజెక్టులకు మళ్లించి పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఏకంగా 1.5 లక్షల కోట్లు తగలబెట్టారని.. దీనివల్ల మార్కెట్లో ఉపాధి పెంచేందుకు అవసరమైన క్యాపిటల్ లేకుండా పోయిందని చక్రవర్తి గణాంకాలతో వివరించారు. చైనా వంటి దేశాలు మౌలిక సదుపాయాలు, సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమలకు విద్యుత్ అందించడంపై ఖర్చు పెడితే, మన దేశంలో అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, ఉచితాలు పంచడం అలవాటుగా మార్చారు. డిగ్రీలు పూర్తి చేసి 4 నుంచి 5 ఏళ్లు దాటినా యువత రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా కూడా.. 4 ఏళ్ల అనుభవం ఉన్న వారికి కూడా కేవలం 4 లక్షల వార్షిక ప్యాకేజీ మాత్రమే లభిస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశంలో క్రోనీ క్యాపిటలిజం తారస్థాయికి చేరింది. కేంద్రంలో కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తే, రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి వాటి సొంత వ్యాపార సంస్థలు ఉన్నాయి. పాలకులు, వారి అనుకూల వ్యాపారవేత్తలు మాత్రమే సంపన్నులుగా మారుతున్నారు సామాన్య ప్రజలకు ఆ సంపద అందడం లేదు. దేశంలో పన్నుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ మీద దాదాపు 100 శాతం పన్నులు విధిస్తున్నారు, నిత్యావసర వస్తువులపై ఏకంగా 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. సామాన్యుడు కష్టపడి సంపాదించే ప్రతి 10 రూపాయలలో మెజారిటీ వాటా ప్రభుత్వం పన్నుల రూపంలో లాక్కుంటోంది. ఒక వ్యక్తి తన సొంత ఫ్లాట్ను మరొకరికి అమ్ముకోవాలన్నా ప్రభుత్వానికి లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టాల్సి వస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ ఫీజులను ఏకంగా నాలుగు రెట్లు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఈ దోపిడీకి పరాకాష్ట. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచం ఇవ్వకుండా పని చేసే ఒక్క తాహసిల్దార్ ఆఫీస్ కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఒక్క పోలీస్ స్టేషన్ కానీ, బిల్డింగ్ పర్మిషన్, కరెంట్, వాటర్ కనెక్షన్ ఇచ్చే ఒక్క విభాగం కూడా దేశంలో ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రతి ఇసుక రీచ్, మైనింగ్, వైన్ షాప్, కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు, కమిషన్లు వసూలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా.. మరమ్మతులకు ప్రభుత్వాల దగ్గర పైసా నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు. ఈ వ్యవస్థాగత దోపిడీ వల్లే ప్రజలు తీవ్రంగా విసిగిపోయి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం భయపడి వారి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలా గొంతు నొక్కడం, ఖాతాలను బ్యాన్ చేయడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకం. శాంతిభద్రతల సమస్య సాకుతో అకౌంట్లు మూసివేయడం పాలకుల చేతగానితనమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసనలను నేరుగా ఎదుర్కొని, చర్చల ద్వారా వారి కోపాన్ని డిఫ్యూజ్ చేయాలి తప్ప.. ఇలా పారిపోవడం దొంగతనానికి సమానమని నల్లమోతు చక్రవర్తి అన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్ లాంటి ఎంపైర్ వ్యవస్థలపై కూడా ప్రజల్లో నమ్మకం పోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లకు పడిపోయి మెజారిటీ కోల్పోవడానికి ప్రజల్లో ఉన్న ఈ తీవ్ర వ్యతిరేకతే కారణం. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమే అయినా.. ఆయన కూడా పాత ఉచితాల విధానాలనే నమ్ముకోవడం నిరాశకలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2019 నుంచి 2024 వరకు వైసీపీ సాగించిన అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్ల భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అవినీతి, లంచగొండితనం కొనసాగుతుండటంపై ప్రజల్లో మళ్లీ అసంతృప్తి మొదలైంది. జయప్రకాష్ నారాయణ , వీవీ లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్ వంటి మేధావులు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నించి విఫలమవడంతో ప్రజల్లో కొంత నమ్మకం సడలింది. ఏది ఏమైనప్పటికీ.. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి చిన్న చిన్న విత్తనాలు భవిష్యత్తులో పెద్ద విప్లవాలుగా మారతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి, కానీ పాలకుల గుండెల్లో మాత్రం ఇవి వణుకు పుట్టిస్తున్నాయనేది పచ్చి నిజం.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్
http://www.teluguone.com/news/content/what-is-to-be-gained-by-cacroch-party-39-221162.html




