గుట్టపై సీన్ రివర్స్..సీఎం చెప్పిందొకటి..జరుగుతున్నది మరొకటి!
Publish Date:May 1, 2022
Advertisement
తిరుపతిని తలపించేలా యాదగిరి గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే లక్ష్యంతో ఆయల పునర్నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే.. ఆలయ దర్శనాలు ప్రారంభమైన తరువాత అక్కడ సీన్ రివర్స్ అయ్యిందన్న విమర్శలు వినవస్తున్నాయి. కేసీఆర్ లక్ష్యాలు, ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా అక్కడి పరిస్థితి ఉందని యాదగిరిగుట్ట జేఏసీ ఆరోపిస్తున్నది. ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా? లేక దేవాదాయ శాఖాధికారుల ఇష్టారాజ్యంగా సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. గుట్టపైకి వాహనాల అనుమతి, దుకాణాలకు అనుమతి దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు జేఏసీ ఆరోపించడమే కాకుండా ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేసి సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. అయితే వారి ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలకూ ఉపక్రమించకపోవడంతో అంతా సీఎం కనుసన్నలలోనే జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యాదగిరిగుట్ట కొండపైన దుకాణాలు ఉండవద్దని కేసీఆర్ చెబితే..అదుకు భిన్నంగా అధికారులు దుకాణాలకు టెండర్లు పిలవడం, ఆ తరువాత వాటిని రద్దు చేసి వ్యాపార కేంద్రాల తెరిచేందుకు మౌఖిక ఆదేశాలివ్వడం,సీఎం వస్తున్నారనగానే వాటిని మూసివేయించడం మరల మూసివేయించడం, ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ముగించుకుని వెళ్లగానే వ్యాపార కేంద్రాలను తెరిపించడం వంటి సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. జేఏసీ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాస్తవాలు వెలికి తీసేందుకు ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నది. ఉన్నతాధికారులు తమ ఫిర్యాదుపై స్పందిచకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించాలని యోచిస్తున్నది. తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయి వంటి యాదాద్రి పవిత్రతను మంటగలిపే విధంగా అక్కడి కార్యక్రమాలు ఉన్నాయన్న భావన సామాన్య భక్తులలో సైతం కలుగుతోంది. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఒకింత ఇరుకుగా ఉండి అసౌకర్యం ఉన్నప్పటికీ భక్తులకు వసతి, సౌకర్యాల విషయంలో ఇప్పటి కంటే గతంలోనే ఎంతో మెరుగ్గా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొండపై ఎండ బారిన పడకుండా తలదాచుకునేందుకు నీడ కూడా కరవైన పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికకు, ప్రకటనలకు భిన్నంగా జరుగుతున్న కార్యక్రమాలపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు కొందరు బినామీల పేరిట శానిటేషన్, మరమ్మతులు, నిర్మాణపు పనులు చేపడుతూ దేవస్థానం నిధులను ప్రణాళికా బద్ధంగా దుర్వినియేగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఆధారాలతో సహా లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు జేఏపీ తెలిపింది. అసలింతకీ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందాల్సిన యాదగిరి గుట్టపై ఏం జరుగుతోంది? భక్తులలో, స్థానికులలో ఎందుకు ఇంత అసహనం వ్యక్తం అవుతోంది. గుట్ట విషయంలో భారీ స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? నిజంగానే గట్టు పునర్నిర్మాణం, అనంతర పనుల నిర్వహణలో భారీ అవినీతి జరిగిందా? ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించి అవకతవకలు జరిగినట్లు రుజువైతే సంబంధితులపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.
http://www.teluguone.com/news/content/what-is-going-on-in-yadadri-jusj-opposit-to-what-cm-said-25-135301.html





