విజయసాయి కుమార్తెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? జీవీఎంసీని నిలదీసిన హైకోర్టు
Publish Date:Oct 24, 2024
Advertisement
విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డిపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించిన నేహారెడ్డి ఇతరులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు నిలదీసింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను తుంగలోకి తొక్కి భీమిలీ బీచ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ కట్టడాలను నిర్మించారనీ, ఈ విషయంలో చర్యలు తీసుకోకుండా జీవీఎమ్ సీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ జనసేన కార్పొరేట్ మూర్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. నేహారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని అధికారులను ప్రశ్నించింది. ఈ విషయమై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసు విచారణ బుధవారం (అక్టోబర్ 24)న జరిగింది. ఆ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది.. అక్రమకట్టడాలను పూర్తిగా కూల్చలేదనీ, కేవలం ప్రహారి గోడను మాత్రమే కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ చట్టం ప్రకారం కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారు శిక్షార్హులని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇందుకు స్పందనగా జీవీఎంసీ తరఫు న్యాయవాది కోర్టు ఆదేశాల మేరకు అక్రమకట్టడాలన్నిటినీ కూల్చివేసినట్లు తెలిపారు. దీంతో కోర్టు నేహారెడ్డి తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైందా అని ఆరా తీసింది. సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/what-action-taken-on-nehareddy-25-187326.html





