టీఆర్ఎస్ కు నవంబర్ గండం.. ఉద్యమకారుల చేతిలో పరాభవం
Publish Date:Nov 3, 2021
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొచ్చినా పని చేయలేదు. కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు హుజురాబాద్ ఓటర్లు. హుజురాబాద్ ఫలితం తర్వాత మరో అంశం అసక్తికరంగా మారింది. నవంబర్ నెల సీఎం కేసీఆర్ కు అచ్చిరావడం లేదనే చర్చ సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాకా ఇప్పటివరకు 8 ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఆరింటిలో టీఆర్ఎస్ గెలవగా.. రెండు చోట్ల మాత్రమే ఓడింది.అవి మెదక్ జిల్లా దుబ్బాక, కరీంనగర్ జిల్లా హుజురాబాద్. అయితే ఈ రెండు ఎన్నికల ఫలితం నవంబర్ లోనే వచ్చాయి. దీంతో సీఎం కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు నవంబర్ నెల గండం అనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవడంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీకి 2020 నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికను టీఆర్ఎస్ సవాల్ గా తీసుకుంది. మంత్రి హరీష్ రావే ఇంచార్జీగా ఉన్నారు. హుజురాబాద్ తరహాలోనే పోరాడారు. అయినా ఆ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి సంచలనం స్పష్టించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నవంబర్ లోనే వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేనంత హీట్ పుట్టించిన హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిస్తూ ఘన విజయం సాధించారు ఈటల రాజేందర్. దీంతో నవంబర్ మాసం కేసీఆర్ గండం అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలో ముందున్నవారే. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే కావడం మరింత ఆసక్తికరం.
http://www.teluguone.com/news/content/trs-facing-november-tention-25-125748.html