నితీశ్ బాటలో సీఎం చంద్రబాబు నిజమెంత?
Publish Date:Mar 12, 2026
Advertisement
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర రాజకీయాలకు వెళ్లడం ప్రమోషనా, డిమోషనా అని కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, నితీశ్ కుమార్ సెంట్రల్ పాలిటిక్స్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే తన రాజకీయ వారసత్వాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. నితీశ్ కుమార్ చంద్రబాబు కంటే ఒక సంవత్సరం చిన్నవారని పేర్కొన్నారు. ఆయన విజయవంతమైన రాజకీయ నాయకుడని, ఎప్పుడు అధికారంలో ఉండాలో బాగా తెలిసిన నాయకుడని వ్యాఖ్యానించారు. మోదీలా ఎప్పటికీ అధికారంలో ఉండాలనే తత్వం నితీశ్కు లేదని తెలిపారు. నితీశ్ కుమార్ వ్యక్తిగత జీవితం చాలా సాధారణమైందని, బీహార్ పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. ఎన్డీయేలో కీలక పాత్ర పోషించే నాయకుల్లో నితీశ్ కుమార్ ఒకరైతే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్య నేత అని అన్నారు. నితీశ్ మార్గంలోనే చంద్రబాబు ప్రయాణిస్తారా అని రవిశంకర్ ప్రశ్నించగా, టీడీపీ కార్యకర్తల్లో కూడా నాయకత్వంపై చర్చలు జరుగుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. 2024లోనే నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాలని కొంతమంది చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు లోకేశ్దేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో రాష్ట్రపతిగా వెళ్లవచ్చని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటిదేమైనా జరుగుతుందా అని రవిశంకర్ ప్రశ్నించారు. వైసీపీ విమర్శలకు టీడీపీ నుంచి గట్టిగా ప్రతిస్పందించే నాయకులు ఉన్నారని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అలాగే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆయన ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత రాజకీయ శక్తి కొంత మేర తగ్గిందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి చంద్రబాబు విషయంలో ఉండదని అన్నారు. చంద్రబాబుకు ‘విజన్ 2047’ లక్ష్యాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపై అనేక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా అమరావతిని ఆధునిక నగరంగా నిర్మించాలనే లక్ష్యం ఆయనకు ఉందన్నారు. ఆ ప్రణాళికలను భవిష్యత్తులో తన వారసుడు లోకేష్ ముందుకు తీసుకెళ్లే అవకాశముందని చర్చ జరిగింది. అలాగే, ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసేన పార్టీ బలంగా ఉందని, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కువగా చురుకుగా పనిచేస్తారని రవిశంకర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కొన్నిసార్లు పక్కన పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించండి
http://www.teluguone.com/news/content/teluguone-vastava-nivedika-39-215392.html




