ఏపీలో కులాల పేరుతో కొత్త రాజకీయానికి నాంది!
Publish Date:Mar 26, 2026
Advertisement
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్ కమ్మ, కాపు కులాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలపై కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, రాజకీయాల్లో ఓటమి చెందిన నేతలు మళ్లీ ప్రయత్నించడం సహజమని అన్నారు. వైసీపీ హయాంలో కుల ద్వేషం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కుల ప్రభావం ఎప్పటినుంచో ఉన్నదని, అయితే జగన్ ఐదేళ్ల పాలనలో అహంకారం మితిమీరిందని విమర్శించారు. కుల రాజకీయాలు ఉన్మాద స్థాయికి చేరి ఇతర కులాలపై విమర్శలు చేయించారని అన్నారు.దీనికి ప్రతిస్పందించిన రవిశంకర్, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై దాడులు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. ఈ విధానం వల్లే జగన్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని, అనవసరంగా శత్రువులను సృష్టించుకున్నారని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇదే కారణంగా వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు తక్కువగా ఉంటాయని, జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల్లో కుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. కుల అభిమానం వేరు, కుల ద్వేషం వేరు అని, ప్రతి ఒక్కరూ తమ కులాన్ని గౌరవించుకోవచ్చు కానీ ఇతర కులాలను ద్వేషించకూడదని సూచించారు. అమరావతి విషయంలో కూడా అన్ని కులాల ప్రజలు భూములు ఇచ్చారని, ఎస్సీ, బీసీ, ఓసీ అన్న తేడా లేకుండా అందరూ భాగస్వాములయ్యారని రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం నగరాల్లో కులం కంటే ఆర్థిక స్థితి ప్రభావం ఎక్కువగా ఉందని, డబ్బు ఉంటే కుల భేదాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు.ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ల మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు.
http://www.teluguone.com/news/content/telugu-one-vastava-vedika-39-216236.html





