మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. సమరానికి సిద్దమవుతున్న పార్టీలు
Publish Date:Jul 15, 2025
Advertisement
తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిచాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలుస్తుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇప్పటికే ఎన్నికలను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆలోపే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతానికి పంచాయతీలకంటే ముందు పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓటర్ జాబితా సిద్ధం కాగా.. కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, ప్రింటింగ్ కూడా అధికారులు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. మెజారిటీ స్థానాలను ఆ పార్టీనే దక్కించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి సింహభాగం స్థానాలు దక్కాయి. వేరే పార్టీల్లో గెలిచిన వారు సైతం అప్పట్లో బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ.. ఇంకా బీఆర్ఎస్లో తాజా మాజీ ప్రజాప్రతినిధుల శాతం అధికంగానే ఉంది. గ్రామాల్లో ఇంకా ఆ పార్టీ కేడర్ బలంగా ఉండగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్ను బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలతో పోటీ హోరాహోరీగా ఉండనుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామనే అంశంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎక్కువ సంఖ్యలో నిర్మించడం, సన్న బియ్యం పథకం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే బీఆర్ఎస్ తమకున్న కేడర్, గతంలో చేసిన పనులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తరచూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే పక్షంలో తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గేట్వేగా ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం అనుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుని.. సరైన అభ్యర్థులను నిలిపితే ఫలితం ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పంచాయతీలను పార్టీ గుర్తుపై కాకుండా ఇతర గుర్తులపై గెలుచుకోవాల్సి ఉంటుంది. పరిషత్ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుగా పరిషత్ ఎన్నికలను నిర్వహించి, ప్రభుత్వ పని తీరుకు గెలుపు అని చెప్పాలని భావిస్తోంది. ఒకవేళ బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ గతంలో భావించింది. దానిపై కొంత విమర్శలు రావడంతో ఎలాగైనా చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసింది. దాంతో ఆశావహులు అప్పుడే పల్లెల్లో ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో అధికార పక్షం విపక్షాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తుండగా.. గతంలో రిజర్వేషన్లు తక్కువగా ఉన్న సమయంలోనూ బీసీలు జనరల్ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-local-bidies-elections-in-three-months-25-202047.html





