మార్గదర్శిపై కేసు కొట్టివేత
Publish Date:Aug 5, 2025
Advertisement
మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. హిందూ అవిభాజ్య కుటుంబ కర్త మరణించడంతో మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చలేరని మార్గదర్శి సంస్థ కోర్టుకు వివరించింది. దీనిపై సుప్రీం కోర్టు గత ఏడాది ఏప్రిల్ లో ఈ పిటిషన్లను తిరిగి హైకోర్టుకు పంపింది. వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఈ కేసును కొనసాగించాలా? లేదా? అనేది తేల్చాలని హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, 2024 సెప్టెంబరు 26న హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అయితే, డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు కూడా క్లెయిమ్తో ముందుకు రాలేదు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉన్న క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసును 2018లోనే హైకోర్టు కొట్టివేయడం.. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది.
http://www.teluguone.com/news/content/telangana-high-court-dismiss-case-against-margadashi-25-203565.html





