అమెరికా తీరు మారితేనే చర్చలు.. కుండబద్దలు కొట్టిన ఇరాన్
Publish Date:May 1, 2026
Advertisement
అమెరికా తన వైఖరి మార్చుకుని.. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తేనే దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు ముందుకు వస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ అనుసరిస్తున్న మొండి వైఖరి, రెచ్చగొట్టే చర్యల వల్లనే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్న ఆయన. . తమపై ఆంక్షలను ఎత్తివేసి.. గౌరవప్రదమైన రీతిలో వ్యవహరిస్తేనే చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందని విస్పష్టంగా తేల్చేశారు. జపాన్ ప్రధానమంత్రి సనాయే టకాయిచీతో ఫోన్ లో మాట్లాడిన పెజెష్కియాన్, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని విమర్శించారు. ఇరాన్ నౌకలపై అమెరికా పాల్పడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న జపాన్ నౌక, దాని సిబ్బందిని సురక్షితంగా విడిచిపెట్టడంపై ఇరువురు నేతలు చర్చించారు. తమ నౌకను వదిలిపెట్టినందుకు జపాన్ ప్రధాని ఇరాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు తిరిగి ప్రారంభమై, ఒక శాశ్వత ఒప్పందం కుదరాలని ఆకాంక్షించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. సముద్ర మార్గాలపై దిగ్బంధనం విధించడం ప్రపంచ శాంతికి ముప్పు అని పెజెష్కియాన్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్లో జరిగిన ఇరాన్, అమెరికా చర్చలు విఫలమైన తర్వాత అమెరికా హర్మూజ్ జలసంధిపై దృష్టి పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. దిగ్బంధనాల ద్వారా తమను లొంగదీసుకోవాలని చూడటం సాధ్యం కాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో అమెరికా తన విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పులు చేసుకుంటుందనే దానిపైనే ఇరాన్ తదుపరి అడుగులు ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు. దీనిపై అమెరికా స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
http://www.teluguone.com/news/content/talks-only-if-us-stance-changes-36-218685.html





