తాడేపల్లి డైరెక్షన్ లోనే పల్నాడు హింసాకాండ?
Publish Date:May 18, 2024
Advertisement
ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పల్నాడులో ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు హింసాకాండపై చాలా సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వివరణ కోరింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా పలువురు ఎస్పీలు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టర్ పై కూడా బదిలీ వేటు వేసింది. అంతటితో ఆగకుండా ఏపీలో అల్లర్లపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం 13 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. నేరుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కొందరు పోలీసులు తమ పై అధికారుల సూచనలు, ఆదేశాలు కూడా ఖాతరు చేయకుండా అల్లర్లను ప్రేరేపించే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిట్ నివేదిక పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు పోలీసులు వైసీపీ మూకలు చెలరేగిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారన్న అనుమానాలూ ఉన్నాయి. పోలింగ్ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన హింస, ప్రతిపక్షాలపై దాడుల వెనుక జగన్ అనుకూల పోలీసు అధికారుల పాత్ర ఉందన్న చర్చ పోలీసు అధికారుల్లోనే జోరుగా సాగుతోంది. ఆ అధికారులు ఎన్నికల విధుల్లో లేరనీ, కానీ తమ పలుకుబడిని ఉపయోగించి కింది స్థాయి పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేశారని అంటున్నారు. ఇక సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు రాష్ట్రానికి కొత్త డీజీపీగా వచ్చిన హరీష్ కుమార్ గుప్తా పూర్తి క్రియారహితంగా వ్యవహరించారనీ, ఆయన సీఎస్ ఆదేశాల మేరకే పని చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి తన వైసీపీ అనుకూల వైఖరితో ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడేలా చేశారని తెలుగుదేశం కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఇక తాజాగా ఏర్పాటైన సిట్ నివేదిక ఆధారంగా సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. సిట్ పై తెలుగుదేశం కూటమి సభ్యులు మాత్రం పెదవి విరుస్తున్నారు. 13 మంది సిట్ బృందంలో అత్యధికులు ఏసీబీ నుంచే ఉన్నారనీ ఇటీవలే ఎన్నికల విధుల నుంచి ఉద్వాసనకు గురైన మాజీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఏసీబీ చీఫ్ గా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. ఎన్నికల విధుల్లో లేని నిజాయితీ పరులైన పలువురు పోలీసు అధికారులు ఉండగా సిట్ లో ఏసీబీ అధికారులకే ప్రాథాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.
http://www.teluguone.com/news/content/tadepally-palace-direction-behind-palnadu-violence-39-176280.html