అత్యాచారం చేసిన సౌదీ దౌత్యవేత్తకి శిక్ష పడుతుందో లేదో?
Publish Date:Sep 10, 2015
Advertisement
నేటికీ రాజరిక పరిపాలన కొనసాగుతున్న సౌదీ అరేబియాలో చిన్నపాటి నేరాలకి కూడా కటినమయిన శిక్షలు అమలు చేస్తుంటారు. ఇక హత్యలు, మానభంగాల కేసులలో అయితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవలసిందే. ఆ శిక్షలు కూడా మామూలుగా ఉండవు. అటువంటి కేసుల్లో చాలాసార్లు శిరచ్చేదనం చేస్తారు. అదే ఒక సౌదీ దౌత్యవేత్త పదేపదే ఇద్దరు మహిళలను రోజుల తరబడి మానభంగం చేస్తే? తను మానభంగం చేయడమే కాకుండా తన స్నేహితుల చేత కూడా వారిని మానభంగం చేయిస్తుంటే? రోజూ వారిని మానభంగం చేస్తూనే వారికి తినడానికి తిండి కూడా ఇవ్వకుండా వారి చేత ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకొంటుంటే? ఎటువంటి శిక్షలు విధించాల్సి ఉంటుందో సౌదీ ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. డిల్లీలోగల సౌదీ ఎంబసీలో పనిచేస్తున్న ఒక సౌదీ అధికారి ఇంట్లో ఇద్దరు నేపాలీ మహిళలు పనిమనుషులుగా చేస్తున్నారు. వారిలో ఒకామె వయసు 50సం.లు మరొకరిది 30సం.లు. వారిరువురూ తమ కుటుంబాలను పోషించుకొనేందుకు సౌదీ అరేబియా వెళ్లి డబ్బు సంపాదించుకోవాలని ఆశ పడ్డారు. కానీ ఒక నేపాలీ ఏజెంట్ వారిని సదరు సౌదీ అధికారి ఇంట్లో పనికి కుదిర్చాడు. అప్పటి నుండి అతను వారిరువురికీ ఈ భూమ్మీద నరకం అంటే ఏమిటో చూపించాడు. రోజుల తరబడి ఆహారం లేకుండా ఇంటి పని చేయవలసి వచ్చేది. అంతే కాకుండా అతనికి రోజూ మసాజులు చేయడం, ఆ తరువాత అతను, అతని ఇంటికి వచ్చే స్నేహితుల చేతిలో మాన భంగానికి గురికావడం చాలా రోజులుగా సాగుతోంది. వారిద్దరినీ మెయితీ-ఇండియా అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బాలకృష్ణ పాండే రక్షించకపోయుంటే వారు ఏదో ఒకరోజు శవాలయి తేలేవరేమో? వారిని గుర్ గావ్ క్రైం బ్రాంచ్ పోలీసులకి అప్పగించడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. వారిరువురినీ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందించి, వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకొన్నారు. సదరు అధికారి దౌత్యవేత్తగా పనిచేస్తున్నందున దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉంటాడు. కానీ ఆ సంగతి తెలియక అతనిని అరెస్ట్ చేసేందుకు ఇద్దరు పోలీసులు సౌదీ ఎంబసీలోకి సోమవారం ప్రవేశించారు. సౌదీ ఎంబసీలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి తమ పరిధిని అతిక్రమించారని, అది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, కనుక వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ సౌదీ రాయబారి సౌద్ అల్ సతి, భారత విదేశాంగ శాఖలో గల్ఫ్ దేశాల జాయింట్ సెక్రటరీ తంగ్లూర దార్లంగ్ కి పిర్యాదు చేసారు. ప్రస్తుతం సదరు అధికారిని అరెస్ట్ చేయడానికి వీలులేదు కనుక విదేశాంగ శాఖ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని క్రైం ఏ.సి.పి. రాజేష్ కుమార్ తెలిపారు. ఆ సౌదీ అధికారిని అరెస్ట్ చేయలేకపోయినా అతనితో కలిసి ఈ హేయమయిన నేరానికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ వారికి దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉండి ఉంటే వారినీ అరెస్ట్ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు భారత్-సౌదీ విదేశాంగ శాఖ అధికారులు చర్చిస్తున్నారు. బాధిత మహిళలు ఇద్దరూ నేపాల్ దేశానికి చెందిన వారు కావడంతో ఇప్పుడు ఇది మూడు దేశాలకు సంబంధించిన సమస్యగా మారింది. కానీ ఇటువంటి నేరాలకు కటినమయిన శిక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ దౌత్యవేత్తకి కూడా అదే విధంగా శిక్షిస్తుందో లేక అధికారులకొక న్యాయం సామాన్య ప్రజలకు మరొక న్యాయం అని అంటుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/saudi-diplomat-45-49952.html