హింసను నిలువరించింది.. పోలింగ్ కు సహకరించింది.. శభాష్ తెలుగుదేశం క్యాడర్!
Publish Date:May 14, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల పోలింగ్ స్టేషన్లలో మంగళవారం (మే14) తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. తమ వంతు వచ్చే వరకూ ఓటర్లు ఓపికతో ఎదురు చూస్తే రాత్రంతా జాగారం చేయడం ఓటరు చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంత వరకూ గెలుపు మాదంటే మాదంటూ అధికార విపక్షాలు తమ వాదనలకు సాధ్యమైనంత పదును పెట్టుకుంటాయి. పార్టీలు చెప్పుకోవడంతో సంబంధం లేకుండానే ఫలితం ఏమిటన్నది ఇప్పటికే అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తారిఖునే అధికారికంగా ఏ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అన్నది తేలుతుంది. కానీ ఈ సారి ఏపీలో ఎన్నికల సరళి, ఓటరు చైతన్యం, ఓటు వేయాలన్న పట్టుదలతో జనం కదిలిన తీరు అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత జనంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రత్యేకంగా, ఒక విశేషంగా చెప్పుకోవలసిందేమిటంటే.. గత ఐదేళ్లుగా అన్ని విధాలుగా వేధింపులకు గురై, కేసుల్లో ఇరుక్కుని నానా అగచాట్లూ పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఉత్సాహం. చేసిన త్యాగాలు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా తెలుగుదేశం శ్రేణులు అహర్నిశలూ కష్టపడ్డాయి. ముఖ్యంగా పొత్తుల కారణంగా త్యాగాలు చేయాల్సి వచ్చినా, అనుకున్న నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పోటీలో లేకపోయినా.. తెలుగుదేశం క్యాడర్ నిరుత్సాహ పడలేదు. అదు ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో పని చేసింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో ను బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చంద్రబాబు సంతకం అన్న సంగతిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో తెలుగుదేశం క్యాడర్ కంప్లీట్ గా సక్సెస్ అయ్యింది. వైసీపీ మూకలు ఎంత రెచ్చగొట్టినా, పోలింగ్ కు విఘాతం కలిగించే లక్ష్యంతో ఎంతగా హింసాత్మక చర్యలకు పాల్పడినా తెలుగుదేశం శ్రేణులు, నేతలూ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పోలింగ్ సజావుగా సాగేలా చూశారు. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ సర్వశక్తులూ ఒడ్డి పనిచేశారు. ఇక్కడ పోటీలో ఉన్నది తెలుగుదేశం అభ్యర్థా, బీజేపీ అభ్యర్థా అని చూడలేదు. కూటమి అభ్యర్థి అంటే తెలుగుదేశం అభ్యర్థే అన్నట్లుగా పని చేశారు. దీంతో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీకి ఎలాంటి అవరోధాలూ లేకుండా సజావుగా సాగింది. తెలుగుదేశం, జనసేన పొత్తులోకి బీజేపీ వచ్చి కలిసిన తరువాత తొలి రోజులలో ఓట్ల బదిలీ పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉన్న బలంతో సంబంధం లేకుండా పేచీపెట్టి మరీ బీజేపీ పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలు దక్కించుకోవడం, అక్కడితో ఆగకుండా చివరి క్షణం వరకూ సీట్ల మార్పు కోసం మడత పేచీలు పెట్టడంతో ఒక దశలో బీజేపీ పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం చేయాలన్న వ్యూహంతో పని చేస్తోందా అన్న అనుమానాలు కూడా తెలుగుదేశం క్యాడర్ లోనే వ్యక్తం అయ్యాయి. పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుపై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఎన్నికల రోజుల మాత్రం అన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం శ్రేణులు కూటమి అభ్యర్థుల కోసం పని చేశాయి. అలాగే జనసేన బీజేపీ శ్రేణులు కూడా కదలడంతో మూడు పార్టీలూ ఒక్కటే అన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఓటు బదలీ సజావుగా సాగింది. పల్నాడు, పుంగనూరు వంటి సున్నిత ప్రాంతాలలో అధికార పార్టీ పెద్ద ఎత్తున హింసకు పాల్పడినా ఎన్నికల సంఘం, పోలీసు శాఖ చోద్యం చూస్తూ నిలిచిపోయాయి. అయితే అవి చేయాల్సిన పని కూడా తెలుగుదేశం క్యాడరే చేసింది. వైసీపీ గూండాయిజాన్ని ఎదురొడ్డి ఎదుర్కొని నిలువరించింది. ప్రాణాలను ఫణంగా పెట్టి కూటమి విజయం కోసం నిలబడింది. తెలుగుదేశం క్యాడర్ స్థైర్యం, ధైర్యం ముందు వైసీపీ వ్యూహాలు పారలేదు. హింసతో భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ జరగకుండా చేయాలన్న వైసీపీ ఎత్తుగడ భగ్నమైంది. దీంతో అనీల్ కుమార్ యాదవ్, గోపిరెడ్డి వంటి వైసీపీ నేతలు ఎన్నికల సంఘం, అధికారులు, పోలీసులు తమ చేతులు కట్టేసి తెలుగుదేశం శ్రేణులకు అనుకూలంగా వ్యవహరించారంటూ మీడియా ముందు బేలగా చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. టీడీపీ క్యాడర్ ప్రతిఘటనతో పల్నాడుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంబటి రాంబాబు, పినెల్లి రామకృష్ణారెడ్డి వంటి వైఎస్సార్సీపీ నేతలందర్నీ డిఫెన్స్ లో పడేసింది. గత ఐదేళ్ల దాడులు, బెదరింపులు, వేధింపులకు దీటుగా సమాధానం చెప్పింది. ఇంకానా ఇకపై సాగవు అంటూ విస్పష్ట సందేశం ఇచ్చింది. ప్రజలలోనూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేసే ధైర్యాన్నిచ్చింది. ఇక్కడే అధికారికంగా ఫలితం వెలువడటానికి ముందే తెలుగుదేశం పార్టీకి నైతిక విజయం దక్కేటట్లు చేసింది.
అక్కడి వరకూ ఒకెత్తు అయితే పోలింగ్ రోజున పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, సంయమనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/sahbash-tdp-cadre-25-175950.html