రుషికొండ ప్యాలెస్ వివాదం.. గంగపుత్రులకు, గిరిపుత్రులకు ఇవ్వాలన్న అడుసుమిల్లి!
Publish Date:Jun 19, 2026
Advertisement
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పదంగా మారిన విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు ఈ భవన సముదాయాన్ని సందర్శించిన నేపథ్యంలో, దీనిపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్యాలెస్ నిర్వహణ కోసం ప్రజాధనం భారీగా వృథా అవుతుండటంపై రాజకీయ, సామాజిక విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ ప్యాలెస్ను సమాజంలో వెనుకబడిన వర్గాలైన గంగపుత్రులకు , గిరిపుత్రులకు అంకితం చేయాలన్న ప్రతిపాదన చేశారు. ఈ ప్యాలెస్లోని కొంత భాగాన్ని వారి సాంప్రదాయ ఉత్పత్తుల ప్రదర్శనకు, చేతివృత్తుల ఎగ్జిబిషన్కు కేటాయించాలని అడుసుమిల్లి శ్రీనివాసరావు సూచించారు. గిరిజనులు సేకరించే స్వచ్ఛమైన అడవి తేనె, పసుపు, ఔషధ మూలికలతో పాటు, మత్స్యకారుల ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తే.. పర్యాటకంగా కూడా విశేష ఆదరణ లభిస్తుందన్నారు. దీనివల్ల పర్యాటకులు భారీగా తరలివస్తారని, టికెట్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ నిర్వహణ కోసం నెలనెలా పాతిక లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోందనీ, గతంలో ఇక్కడున్న పర్యాటక రిసార్ట్ ద్వారా ప్రభుత్వానికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని.. ఇప్పుడు మాత్రం అది భారంగా మారిందని అన్నారు. ఈ భవన నిర్మాణానికి కారణమైన గత పాలకుల నుంచి, అందుకు సహకరించిన అధికారుల నుంచి మొత్తం సొమ్మును రికవరీ చేయాలన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయ విమర్శలు రావడం సహజమని, అయితే ఎలాంటి శంకలు లేకుండా నిరుపేదలకు దీనిని కేటాయిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతారని అడుసుమిల్లి అన్నారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/rushikonda-palace-controversy-39-223536.html





