బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. మహానాడు వేదికగా లోకేష్ ప్రకటన
Publish Date:May 27, 2026
Advertisement
తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ మహానాడు వేదికగా సంచలన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్న ఆయన మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చెప్పారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేశ్ తొలిసారిగా మహానాడులో పాల్గొన్నారు. అంతకుముందు రోజు తాను ఒక భారీ ప్రకటన చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమ వేదికగా లోకేష్ చేసిన పోస్టుతో ఆ ప్రకటన ఏమై ఉంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందుకు తగ్గట్టుగానే.. పార్టీ అంతర్గత రాజకీయాల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును ప్రకటిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై మహిళా నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సందర్భంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
http://www.teluguone.com/news/content/reservation-for-women-39-221015.html





