ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్
Publish Date:May 15, 2024
Advertisement
ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటలవరకూ పోలింగ్ కొనసాగింది. సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీవ్యాప్తంగా 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్ నమోదైనట్లు చెప్పారు. రెండు గంటల వరకూ పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో 81 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
జిల్లాలవారీగా చూస్తే సాయంత్రం ఐదుగంటల వరకూ.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 55.17 శాతం పోలింగ్ నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా 73.55 శాతం, కృష్ణా జిల్లా 73.53 శాతం, బాపట్ల జిల్లాలో 72.14 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 72.85 శాతం, నంద్యాలలో 71.43 శాతం, ప్రకాశం 71 శాతం, నెల్లూరు జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/record-polling-in-ap-39-176024.html