ఏపీ ఆర్థికంపై కేంద్రం సీరియస్.. ఢిల్లీకి గవర్నర్
Publish Date:Apr 23, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హస్తిన పర్యటన ఏపీ రాజకీయాలలో పలు ఊహాగానాలకు తెరతీసింది. తన హస్తిన పర్యటనలో భాగంగా గవర్నర్ బిశ్వజిత్ రాష్ట్రపతితోనే కాకుండా ప్రధాని మోడీతో కూడా భేటీ అవ్వనున్నారు. రాష్ట్రపతిలో గవర్నర్ భేటీ సహజంగానే తీసుకున్నా... ఇంత హఠాత్తుగా హస్తిన పర్యటన పెట్టుకుని, మోడీతో బిశ్వజిత్ భేటీకి కారణమేమిటన్నదానిపై రాజకీయ సర్కిళ్లలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి లేదా పీకే సలహా మేరకు కాంగ్రెస్ తో పొత్తు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సమాచారం విశ్వసించదగ్గదిగా లేదని భావించిన కేంద్రం వాస్తవాలను గవర్నర్ నుంచి తెలుసుకోవడం కోసమే గవర్నర్ ను ఢిల్లీకి పిలిపించుకున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ అవసరాలకు సైతం అప్పు లేకుండా అడుగు ముందుకు పడని పరిస్థితుల్లో సతమతమౌతున్న పరిస్థితుల్లో అసలు వాస్తవ పరిస్థితిపై కేంద్రం సమగ్ర నివేదికను ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరినట్లు చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారం సమగ్రంగా లేదని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలోనే గవర్నర్ నవేదికను కోరిందని అంటున్నారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలన్న పీకే సూచన మేరకు ముందుకు సాగడానికి జగన్ నిర్ణయించుకున్నారన్న సమాచారంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కూడా గవర్నర్ ను హస్తినకు పిలిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఏపీ గవర్నర్ హస్తిన పర్యటన రాజకీయ ఊహాగానాలకు తావిస్తున్నది. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, ఆర్థిక సంక్షోభం, కొత్త రాజకీయ సమీకరణాల చర్చోపచర్చల నేపథ్యంగా గవర్నర్ హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
http://www.teluguone.com/news/content/reason-behind-ap-governer-delhi-tour-25-134841.html





