గోషామహల్కు ఉప ఎన్నిక రాదంటున్న రాజాసింగ్
Publish Date:Jul 29, 2025
Advertisement
గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి కోరితే తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుందంటూ కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ లేని పోని గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలు తనను పిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన బాధలు వారికి చెప్పిన తర్వాత తాను బీజేపీలో తిరిగి చేరే అంశంపై క్లారిటీ ఇస్తానన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి వ్యక్తిగతంగా పిలిస్తే.. వెళ్లి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు తనతో టచ్లోనే ఉన్నారన్న రాజాసింగ్.. తాను శివసేన, టీడీపీ, జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇవన్నీ బీజేపీ మిత్రపక్ష పార్టీలేనని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షడు రామచందర్ రావు బాగానే పని చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నిక జరిగింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులున్నాయి. అయితే అదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుచరగణంతో కలిసి పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. అయితే ఆయన్ని పార్టీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై అక్కడికక్కడే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి, నాయకులకు ఒక దణ్ణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకులకు పంపారు. వారు వెంటనే దానిని ఆమోదించారు. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. అది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్తోపాటు గోషా మహల్ అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీజేపీని విడిచి పెట్టవద్దంటూ ఢిల్లీలోని కొంత మంది ఆ పార్టీ నేతలు.. రాజాసింగ్కు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వారు పార్టీ అగ్రనాయకత్వంతో మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే రాజా సింగ్కు ఢిల్లీలోని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని.. వారితో భేటీ తర్వాత మళ్లీ బీజేపీలో చేరే అంశంపై క్లారిటీ ఇస్తారనే ఓ చర్చ అయితే గోషామహల్లో సాగుతోంది. అదీకాక.. గత కొంత కాలంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఒక ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను గుర్తించకపోయినా.. తనను గుర్తించే వాళ్లు చాలా మంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారంతా బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు. తాను వెళ్లి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ చాలా బాగా పెరిగిందని వివరించారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు చేసారో అన్ని తనకు తెలుసునని చెప్పారు.
http://www.teluguone.com/news/content/rajasingh-say-no-by-poll-to-goshamahal-25-203031.html





