మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రాజెక్ట్ పునర్విక!
Publish Date:Apr 20, 2026
Advertisement
అరుదైన జన్యువ్యాధులతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాతల సహకారంతో పాటు మంత్రి లోకేష్ చొరవతో పునర్వికకు పునర్జన్మ లభించిన విషయం తెలిసిందే. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ చిన్నారి బోసినవ్వులను చూసి భావోద్వేగానికి లోనైన మంత్రి నారా లోకేశ్.. ఇలా అరుదైన వ్యాధులతో ఇకపై ఏ చిన్నారి జీవితం అర్థంతరంగా ముగియకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి చిన్నారుల కోసం ప్రాజెక్ట్ పునర్విక అనే కొత్త పథకాన్నిమంత్రి లోకేష్ ప్రకటించారు. అత్యంత ఖరీదైన చికిత్స అవసరమయ్యే అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలను ఈ పథకం ద్వారా ఆదుకుంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలకు ఖరీదైన వైద్యం అందేలా ఈ పథకం ప్రకారం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు భరోసా ప్రాజెక్ట్ పునర్విక!.. లోకేష్ చొరవతో కొత్త పథకం రాష్ట్రంలోని చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. అరుదైన జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పసిపిల్లలకు అండగా నిలిచేందుకు ప్రాజెక్ట్ పునర్విక అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక స్థోమత లేక, సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ ప్రాజెక్ట్ పునర్విక నిస్సందేహంగా ఒక ఆశాకిరణం కానుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక పథకం రూపుదిద్దుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో పునర్విక అనే చిన్నారి ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, ఆ కుటుంబం పడిన మానసిక వేదన మంత్రి లోకేష్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ చిన్నారి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించిన ఆయన.. భవిష్యత్తులో ఏ బిడ్డ కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బంది పడకూడదన్న నిశ్చయానికి వచ్చారు. కేవలం తాత్కాలికంగా సహాయం అందించి వదిలేయడం కాకుండా.. ఈ తరహా వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. దీని ఫలితంగానే ప్రాజెక్ట్కు ప్రాజెక్ట్ పునర్విక రూపుదిద్దుకుంది. సాధారణంగా జన్యు సంబంధిత వ్యాధుల చికిత్స అత్యంత ఖరీదైన వ్యవహారం. ఒక్కో వ్యాధికి వాడే మందులు, ఇంజెక్షన్ల ధరలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఖర్చు తలకు మించిన భారం అనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు మంత్రి లోకేష్ ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ ఔషధ కంపెనీలతో ప్రభుత్వం నేరుగా చర్చలు జరిపి, తక్కువ ధరలకే మందులు లభ్యమయ్యేలా ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వమే నేరుగా ఈ కంపెనీలతో భాగస్వామిగా మారడం వల్ల చికిత్స ఖర్చులను గణనీయంగా తగ్గుతాయి. దీనికి తోడు, ఈ అరుదైన వ్యాధులపై కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విధానపరమైన మద్దతు, నిధుల సమీకరణకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరిపి, జాతీయ స్థాయిలో కూడా ఈ అంశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ అమలును మరింత వేగవంతం చేసేందుకు, వైద్య నిపుణుల సలహాలు తీసుకునేందుకు త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వైద్య రంగంలోని నిష్ణాతులు, సీనియర్ వైద్యులతో కలిసి చికిత్సా విధానాలపై చర్చించనున్నారు. కేవలం మందులు అందించడమే కాకుండా, ఈ వ్యాధులను ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలో గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు, అరుదైన వ్యాధుల బారిన పడిన బాధితుల కుటుంబాలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, సామాజికంగా వారికి అండగా నిలిచేందుకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఈ ప్రాజెక్ట్ పునర్వికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. నిధుల కేటాయింపు నుంచి మందుల పంపిణీ వరకూ ఎక్కడా జాప్యం జరగకుండా ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి బిడ్డకూ నాణ్యమైన వైద్యం అందాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ఇలాంటి ప్రత్యేకమైన వైద్య అవసరాలపై దృష్టి సారించడం శుభపరిణామమని మేధావులు అంటున్నారు. అరుదైన జన్యు వ్యాధులతో సతమతమవుతున్న ఎంతోమంది తల్లిదండ్రులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట కానున్నది. రాబోయే రోజుల్లో ప్రాజెక్ట్ పునర్విక వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఒక రోల్ మోడల్గా మారుతుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. శాస్త్రీయ దృక్పథంతో, మానవీయ కోణంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడుగులు నిరుపేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతాయన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
http://www.teluguone.com/news/content/project-punarvika-with-lokesh-36-217784.html





