గుంటూరు ఎస్పీపై పొలిటికల్ కుట్ర?
Publish Date:Jun 27, 2025
Advertisement
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందా? ఆయన వరుస వివాదాలలో చిక్కుకోవడానికి కారణాలేంటి? ఎవరైనా ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వివాదాల్లో నెడుతున్నారా?.. గుంటూరులో జగన్ కాన్యాయ్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసులో జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించింది ఎవరు? తీవ్ర కలకలం రేపిన ఆ ప్రమాదానికి సంబంధించి వినిస్తున్న ప్రచారంపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు. గుంటూరు మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో అక్కడ రాజకీయాలు అంతే హాట్గా ఉంటాయి.. ప్రతిపక్షాన్ని అధికారపక్షం, అధికార పక్షాన్ని ప్రతిపక్షం ప్రతిరోజు ఏదో ఇష్యూకి సంబంధించి టార్గెట్ చేసుకుంటూనే ఉంటాయి. అలాంటి గుంటూరులో పోలీస్ అధికారులుగా పని చేయాలంటే కత్తి మీద సామే అంటారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు జిల్లాలో పనిచేసే ప్రతి అధికారి పరిస్థితి అలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి జిల్లాలో జిల్లా ఎస్పీగా పనిచేయటం అనేది ఒక సవాల్ అని గుంటూరు జిల్లాలో గతంలో పనిచేసిన అధికారులు సైతం చెబుతూ ఉంటారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కూడా ప్రతిరోజు ఒక సవాల్నే ఎదురుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సింగయ్య యాక్సిడెంట్ కి సంబంధించి అనేక చర్చలు నడుస్తున్నాయి. జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసులు సింగయ్యను హాస్పిటల్కి తరలించినా ఆయన మృతిచేందారు. జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయి మృతి చెందాడన్న విషయం వైరల్ గా మారింది. అసలు సింగయ్యకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏ వాహనం ఢీకొని చనిపోయిందనే దానిపై పెద్ద చర్చ మొదలైంది. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీ కొనే సింగయ్యే చనిపోయాడని మొదట ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ జగన్ పర్యటన ముగియకుండానే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ప్రెస్ మీట్ పెట్టి సింగయ్యఅనే వ్యక్తి చనిపోయింది జగన్ కాన్వాయ్ ఢీ కొనడం వల్ల కాదని ఒక ప్రైవేట్ వాహనం గుద్దటంతో చనిపోయాడంటూ ఆ వాహనం నెంబరు ప్రకటించారు. ఇప్పుడు ఈ అంశమే గుంటూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు.. పోలీస్ డిపార్ట్మెంట్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే జగన్ ప్రయాణిస్తున్న వాహనమే సింగయ్యను ఢీ కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో గుంటూరు జిల్లా ఎస్పీకి అసలు ఆరోజు సింగయ్యను ప్రైవేటు వాహనం ఢీ కొందని ఎవరు చెప్పారు. అలా చెప్పాల్సిన అవసరం ఏ అధికారికి వచ్చింది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు జిల్లా పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలోని కొందరు పోలీసులు వైసీపీ నేతలకు టచ్ లో ఉండటం వల్లే గుంటూరు జిల్లా ఎస్పీని తప్పుదారి పట్టించే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని పోలీసులే గుసగుసలాడుకుంటున్నారు. గతంలోనూ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలోనూ ఎస్పీ సతీష్కుమార్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన ఆదేశాలు లేకుండానే కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. గోరంట్ల మాధవ్ అరెస్టు విషయంలో సైతం గుంటూరు జిల్లా ఎస్పీని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించారని కొందరు అధికారులను డ్యూటీలో నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను ఎవరు టార్గెట్ చేస్తున్నారనేది డిపార్ట్మెంట్లో హాట్టాపిక్గా మారింది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులను ఛేజించడంలో ఉన్నత అధికారుల మన్ననలు కూడా పొందుతున్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.. పొలిటికల్ అరెస్టులు, వాటి వ్యవహారాల్లో మాత్రం ప్రతిసారి ఏదో ఒక విధంగా విమర్శలు పాలవుతున్నారు. గోరంట్ల మాధవ విషయంలోనూ నిఘా వైఫల్యంతో కింది స్థాయి సిబ్బంది సస్పెన్షన్కు గురయ్యారు. వరుసగా పొలిటికల్ ఘటనల్లో విమర్శలు ఎదుర్కొంటున్న జిల్లా ఎస్పీని కింది స్థాయి అధికారులే తప్పుదారి పట్టిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సతీష్ కుమార్ టార్గెట్గా పని చేస్తున్న ఆవర్గాలే రేపు ఒకవేళ సతీష్ కుమార్ మారిపోయి వేరే అధికారి వచ్చినా, అయన్ని సైతం తమకు అనుకూలంగా పనిచేయకపోతే ఇలాగే టార్గెట్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలోనూ గుంటూరు జిల్లా ఎస్పీ ఒక మీడియా సమావేశంలో తన వెనక ఏం జరుగుతుందనేది తెలియటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. కొందరు కింద స్థాయి అధికారులు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు పాటించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని డిపార్ట్మెంట్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ అధికారులు ఎవరు, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారన్న దానిపై విచారణ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/political-conspiracy-on-guntur-sp-39-200781.html





