సిగాచీ ప్రమాద ఘటనపై..ఎన్డీఎం బృందం సీరియస్
Publish Date:Jul 8, 2025
Advertisement
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఘటనపై ఇప్పటి వరకు 44కు మృతుల సంఖ్య చేరింది. అనంతరం ఎన్డీఎంఏ అక్కడే సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్డీఎంఏ ప్రశ్నలు సంధించింది. యాజమాన్యం సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంతో సీరియస్ అయింది. పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. సమావేశం అనంతరం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 30న పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/pasamylaram-39-201514.html





